రాజీనామాపై ఏదో ఒకటి తేల్చండి: బొత్సతో ధర్మాన భేటీ
ఇటీవలి ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్ఠానంతో ధర్మాన అంశాన్ని ప్రస్తావించగా అధిష్ఠానం స్పష్టతను ఇచ్చింది. ఆయన తిరిగిరాగానే ధర్మానపై నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు. కానీ, ఇప్పటి వరకూ అలాంటిదేమీ జరగలేదు. ఇదే సమయం లో వాన్పిక్కు సంబంధించి సిబిఐ నివేదిక పత్రికల్లో ప్రచురితం కావడం ధర్మానసహా మరికొందరు మంత్రులను ఆందోళనకు గురి చేస్తోంది.
మరింత జాప్యం చేస్తే తమ ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశమున్నట్టు కొందరు మంత్రులు కలవరపడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం బొత్స నివాసానికి ధర్మాన వెళ్లారు. అరగంట సేపు మంతనాలు జరిపిన తర్వాత ఆర్థిక మంత్రి ఆనం వారికి జత కలిశారు. దీనిపై ముఖ్యమంత్రితో మాట్లాడాలని బొత్స సత్యనారాయణకు ఆనం సూచించారు.
రాజీనామాపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే మంచిదని, పత్రికల్లో ప్రతి రోజూ ఏదో ఒక కథనం ప్రచురితమవుతోందని, అది తనకూ, పార్టీకీ మంచిది కాదని ధర్మాన ప్రసాదరావు తెలిసింది. కాగా..ఢిల్లీ పర్యటననుంచి వచ్చిన డీఎస్, డిప్యూటీ సీఎం రాజనరసింహ విడివిడిగా బొత్సతో సమావేశమయ్యారు.