సిద్దంగా ఉండండి, వైయస్లా జగన్: వైయస్ విజయమ్మ
ఫీజు రీయింబర్సుమెంట్సును కుల, మతాలకు అతీతంగా అమలు చేశారని విజయమ్మ అన్నారు. వీటిని ప్రస్తుత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భారంగా భావిస్తోందని విమర్శించారు. తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభంజనాన్ని సృష్టిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాంటి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు గెలుపు ఖాయమన్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
కాగా పంచాయతీరాజ్ ఎన్నికల పోరు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు మంగళవారం పచ్చ జెండా ఊపింది. మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్లు, ఇతర విషయాలకు సంబంధించిన వివరాలను వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
దీంతో జడ్పీటిసి, ఎంపిటీసి, సర్పంచ్ల ఎన్నికలకు మార్గం సుగమం అయింది. రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా నివేదిక రూపొందించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. బిసీ రిజర్వేషన్లను కల్పించడంతో మొత్తం రిజర్వేషన్లు 60 శాతం దాకా అయ్యాయి. దీంతో రిజర్వేషన్లు యాభై శాతం దాటకుండా చూసి ఎన్నికల సంఘానికి ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారం అందించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల గడువు ముగియడంతో స్థానిక సంస్థలు నిరుటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి.