తెలంగాణ హీట్: ఢిల్లీలో రాష్ట్ర నేతలు, తెరపైకి ప్యాకేజీ
బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి హస్తినలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల దీక్షను బుధవారం విరమించారు. బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తెలంగాణకు ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. ఎన్డియే అధికారంలోకి వస్తే మూడు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి అగ్రనేతలు హామీ ఇచ్చారు.
కోదండరామ్ నేతృత్వంలోని తెలంగాణ జెఎసి నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. వారు మంగళవారం కేంద్ర మంత్రి వాయలార్ రవిని, మంగళవారం హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ను కలిశారు. 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ప్రకనట చేయకపోతే ఈ నెల 30వ తేదీన తలపెట్టిన తెలంగాణ మార్చ్తో తమ సత్తా చాటుతామని వారు హెచ్చరిస్తున్నారు.
కాగా, బిసీ డిక్లరేషన్పై జాతీయ నాయకులతో చర్చ కోసమంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇదే సమయంలో ఢిల్లీ చేరుకున్నారు. ఆయన బుధవారం మాజీ ప్రధాని దేవెగౌడతో, జెడియు నేత శరద్ యాదవ్తో, ఎస్పీ అధినేత ములాయం సింగ్తో సమావేశమయ్యారు. ఆయన వారితో బీసీ డిక్లరేషన్పై చర్చించి మద్దతు కోరినట్లు చెబుతున్నారు. ఆయన మరింత మంది నాయకులను కలుసుకునే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్యాకేజీని తెరపైకి తెచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా ప్యాకేజీని ప్రకటించే విషయంపై కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ఈ సందర్భంగానే మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు లాబీయింగ్ ప్రారంభించారు.
సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అధిష్టానం పెద్దలతో సమావేశమై సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రకటన చేయాలని కోరుతున్నారు. బుధవారంనాడు పార్లమెంటు సభ్యురాలు రేణుకా చౌదరి నివాసంలో పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని కరెంట్ సమస్యపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నప్పటికీ ప్రధానంగా రాష్ట్ర విభజనపైనే చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ అంశం తేలిపోతుందంటున్న కెసిఆర్ ధీమాను చూస్తే సమస్యను తేల్చేయడానికి కాంగ్రెసు అధిష్టానం రంగం సిద్ధం చేసుకున్నట్లే కనిపిస్తోంది.