సిఎం సోదరులతో డీల్: దేవినేని, దోచుకున్నోళ్లకు కాపలా

Devineni Umamaheswara Rao
చిత్తూరు/కడప: ప్రాథమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథికి జైలు శిక్ష పడినా, ఆయన ఎన్నికల అఫిడివిట్‌లో తప్పులు ఉన్నాయని సాక్షాత్తూ ఎన్నికల కమిషన్ చెప్పినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడంలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం చిత్తూరు జిల్లాలో విమర్శించారు. మంత్రితో ముఖ్యమంత్రి సోదరులకు డీల్ ఉందని, అందుకే అవినీతి ఊబిలో కూరుకుపోయిన మంత్రిని సిఎం కాపాడుతున్నారని ఆయన ఆరోపించారు.

రైతులు పంటలు నష్టపోయి, పాలన అస్తవ్యస్తంగా తయారైనా పట్టించుకునే దిక్కులేదన్నారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా, చిత్తూరు జిల్లాలో రైతులకు రూ.15 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ పాలకులు హైకోర్టుకు తప్పుడు గణాంకాలు సమర్పించి బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదనీ, ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి కిరణ్ పచ్చి అబద్దాల కోరనీ, దోపిడీదారులకు కాపలాకాస్తున్నారని మరో టిడిపి నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు కడప జిల్లాలో మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహా రెడ్డి సాగునీటి కోసం చేపట్టిన పాదయాత్రలో ఆయన బుధవారం పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం కడపలోని తమ పార్టీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ, సీఎంపై విరుచుకుపడ్డారు. సిఎం అబద్దాల కోరు అనడానికి రూ.15 వేల కోట్ల వ్యయంతో 36 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరిస్తామని రెండేళ్ళుగా ప్రగల్భాలు పలుకడమే నిదర్శనమన్నారు.

లక్షల కోట్లు దోచుకున్నవారికి సిఎం కాపలాదారుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. జలయజ్ఞం కోసం రూ.75 వేల కోట్లు ఖర్చు చేశామంటున్న కాంగ్రెస్ పాలకులు ఇంతవరకు అదనంగా ఒక్క ఎకరాకు సాగునీరు అందించిన పాపానపోలేదన్నారు. లాభం వచ్చే మట్టి పనులు చేసి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకోగా మొబిలైజేషన్ ఫండ్‌ను కాంగ్రెస్ నేతలు పంచుకున్నారని ఆరోపించారు. ఆల్మట్టిలోని అదనపు నీటితో కర్ణాటక ప్రభుత్వం చెరువులు నింపుకుంటుంటే కిరణ్ సర్కార్ చోద్యం చూస్తున్నదన్నారు.

కాంగ్రెస్ పాలకుల స్వార్థం, నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.2 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు పెరిగిందన్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే కృష్ణా డెల్టాకు సాగునీరు లభించేదన్నారు. పదేళ్లయినా జలయజ్ఞం పూర్తయ్యేటట్లు లేదన్నారు. 9 సంవత్సరాల చంద్రబాబు పాలనలో తక్కువ బడ్జెట్‌తోనే 30 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరందించామని చెప్పారు.

స్టూవర్టుపురం దొంగలు తమ వృత్తిని మానేసి జనజీవన స్రవంతిలో కలిసి నిజాయితీగా బతుకుతుంటే కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆ పోస్టులను భర్తీ చేస్తున్నారని గాలి ఎద్దేవా చేశారు. సోనియా భజన, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల కాళ్ల వద్ద తాకట్టుపెట్టడంలోనే ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందన్నారు. ఎన్టీరామారావు చొరవతోనే రాయలసీమలో ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+