జగన్ మీదనే కాదు, వైయస్పైనా కుట్ర: విజయమ్మ

అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ ఫీజు రీయింబర్స్ ఇవ్వాలన్నదే వైఎస్ఆర్ ఆశయమని ఆమె అన్నారు. హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులుగా చేపట్టిన ఫీజు దీక్షను ఆమె శుక్రవారం సాయంత్రం ముగించారు. విద్యార్థినులు ప్రియాంక, నవీనాలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదని మహోన్నతమైన ఆశయంతో మహానేత వైయస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని విజయమ్మ తెలిపారు.
పేద విద్యార్థులకు ఉపయోగపడే పథకాన్ని ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతోందని, ప్రజా సంక్షేమం ప్రభుత్వ బాధ్యత కాదా అని విజయమ్మ ప్రశ్నించారు. వేల కోట్లు రూపాయల్ని పన్నులుగా ఈ ప్రభుత్వం వసూలు చేస్తుందని, ఫీజు రీయింబర్స్ కోసం ఖర్చు పెట్టడానికి వెనకాడుతుందని వైయస్ విజయమ్మ మండిపడ్డారు. గత ఏడాది నుంచి ఫీజు రీయింబర్స్పై పోరాడుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని ఆమె విమర్శించారు.
30ఏళ్లు ప్రజల మధ్య తిరిగిన మహానేత వైయస్సార్ అని, ప్రజా సమస్యలు ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియవని విజయమ్మ అన్నారు. ప్రజల కోసం మహానేత ఎప్పుడు బడ్జెట్ లెక్కలు వేయలేదని అని అన్నారు. రైతులకు వైఎస్ఆర్ చేసిన సేవ ఎనలేనివన్నారు. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ కూడా అమలు కావడం లేదని, ప్రతిపక్షం కూడా ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని, ప్రజా సమస్యల కోసం పోరాడటంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్ విజయమ్మ ఆరోపించారు.
ప్రభుత్వం, ప్రతిపక్షం కుమ్మక్కవ్వడం చరిత్రలో లేదని, వైఎస్ జగన్ను ఎదుర్కోలేకే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యారని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలవడం, అమీర్పేట భూములు కూడా కుమ్మక్కేనని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications