వందో ప్రయోగం సక్సెస్: నింగికెగసిన పిఎస్ఎల్వి సి21
పిఎస్ఎల్వి-సి21 ప్రయోగాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మిషన్ కంట్రోల్ సెంట్రల్ నుంచి ప్రత్యక్షంగా తిలకించారు. ప్రయోగం జరుగుతున్న సమయంలో శాస్త్రవేత్తలు ఉత్కంఠభరితంగా తిలకించారు. విజయవంతం కాగానే అందరూ ఆనందంలో తేలిపోయారు. ప్రధాని శాస్త్రవేత్తలను అభినందించారు.
పిఎస్ఎల్వి-సి21 వాహన నౌక భారత్కు చెందిన మినీ రీజన్ పేలోడ్, జపాన్కు చెందిన 15 కిలోల ప్రొయిటెరాస్, ఫ్రాన్స్కు చెందిన స్పాట్-6 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకు వెళ్లింది. ఈ స్పాట్-6 బరువు 716 కిలోలు. ఈ స్పాట్-6 ఉపగ్రహం 1.5 రిజల్యూషన్తో భూమిని చిత్రీకరించనుంది. ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం.
అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహాన్ని తీసుకు వెళ్లడంలో విజయం సాధించడంతో వాణిజ్య రంగంలో ఇస్రో మరో ముందంజ వేసినట్లుగా చెప్పవచ్చు. ఇస్రో 49 ఏళ్లలో 62 ఉపగ్రహాలను, 37 వాహన నౌకల ప్రయోగాలను చేపట్టింది. ఇస్రో విజయం దేశానికి గర్వ కారణమని, ఇదో మైలు రాయి, మన శాస్త్రవేత్తలు మరో ప్రత్యేకత చాటుకున్నారని ప్రధాని మన్మోహన్ ప్రయోగం విజయవంతం అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.