జగన్పార్టీలో ముసలం:దూరంగా కొండాసురేఖ, అంబటి?
సురేఖ, సుభాష్ చంద్రబోసు, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తమ మంత్రి పదవులను తృణపాయంగా వదులుకొని జగన్కు జై కొట్టారు. అంబటి కూడా జగన్ కోసం త్యాగం చేశారు. ఇలాంటి వారిని ఇప్పుడు పార్టీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో బాలినేని గెలిచారు. దీంతో ఆయనకు పార్టీలో ప్రాధాన్యం ఉంటున్నప్పటికీ ఓడిపోయిన సురేఖ, చంద్రబోసులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదట! అంబటి పరిస్థితి కూడా అలాగే ఉందట.
ఆ ముగ్గురు నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నారనేందుకు గత కొద్ది రోజులుగా వారి వ్యవహార శైలి ద్వారనే అర్థమవుతోందని, అంతేకాకుండా ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో ఎవరికీ అవమానం జరగటం లేదని చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. నిత్యం హైదరాబాదులో ఉండి జగన్ను ఎవరైనా ఏమైనా అంటే ఒంటి కాలిపై లేచే అంబటి మూడు నెలలుగా గుంటూరుకే పరిమితమయ్యారు. ఆయనను కేవలం ఓ నియోజకవర్గానికే పరిమితం చేయాలని పార్టీ భావిస్తోందని అంటున్నారు. ఇది అంబటికి అసంతృప్తిని కలిగిస్తోందట.
చంద్రబోసు, సురేఖలు కూడా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో తమతో సంప్రదింపులు జరపడం లేదనే అసంతృప్తితో ఉన్నారట! తన భర్త, ఎమ్మెల్సీ కొండా మురళి వ్యవహారంలోనూ తామే నష్టపోయామని, మంత్రి పదవి వదులుకున్నామని అయినా పార్టీలో తమకు ప్రాధాన్యత లభించడం లేదని సురేఖ భావిస్తున్నారని అంటున్నారు. చంద్రబోసు కూడా తాను రామచంద్రాపురంకే పరిమితమైతానని ఇటీవల చెప్పడానికి కారణం అసంతృప్తి అంటున్నారు.
పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా సురేఖ హాజరవుతారు. కానీ ఇందిరాపార్కు వద్ద విజయమ్మ చేసిన ఫీజు పోరు దీక్షకు హాజరు కాలేదు. అంతేకాకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అంటే బాగా అభిమానమున్న కొండా సురేఖ ఆయన మూడో వర్ధంతి కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో పార్టీ ముఖ్యనేతల్లో అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయని అంటున్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. కొండా, బాలినేని, చంద్రబోసులు మంత్రి పదవులకు రాజీనామా చేసి వచ్చారని, వారికి ప్రత్యేక స్థానముంటుందని తెలిపారు.