కాంగ్రెసు కండీషన్: చిరంజీవి వర్సెస్ బొత్స సత్తిబాబు
కాంగ్రెసు శిథిలం కాలేదని, బీటలు వారలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు మంచి స్థితిలో ఉందని ఆయన చెప్పారు. చిరంజీవి కాంగ్రెసు నాయకుడని, ఆయన వ్యాఖ్యలను గౌరవించాల్సి ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు పరిస్థితి బాగానే ఉందని, ఇంతకన్నా బాగా ఉండాలని చిరంజీవి ఆశించి ఉంటారని ఆయన అన్నారు. దానితోపాటు చిరంజీవి పార్టీలో సమన్వయం లేదని చేసిన వ్యాఖ్యపై కూడా బొత్స తనదైన శైలిలో మాట్లాడారు.
పార్టీలో సమన్వయం గురించి చిరంజీవి మాట్లాడడంలో తప్పు లేదని, ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమైన తర్వాత కింది స్థాయిలో సమన్వయం పూర్తిగా ఏర్పడలేదని, సమన్వయం కోసం తాము ప్రయత్నిస్తున్నమని, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. విహెచ్ తాను ఏర్పాటు చేసిన సదస్సుకు ఆహ్వానించినా బొత్స సత్యనారాయణ హాజరు కాలేదు.
రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ఢిల్లీలో ఏర్పాటు చేసిన వైయస్ పాదయాత్ర డైరీ ఆవిష్కరణ సభకు మాత్రం బొత్స వెళ్లారు. కెవిపి రామచందర్ రావుపై విహెచ్ తీవ్రంగా మండిపడుతున్నారు. కెవిపి కార్యక్రమం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుందని కూడా ఆయన అన్నారు. వైయస్ పాదయాత్ర డైరీ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. ఆయన వేదిక మీద కూర్చున్నారు. అయితే, ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
బొత్స సత్యనారాయణ మంగళవారం మీడియా సమావేశంలో కెవిపి ఏర్పాటు చేసిన వైయస్ పాదయాత్ర డైరీ కార్యక్రమాన్ని కూడా సమర్థించారు. వైయస్ డైరీ రాయకపోయినా అందులో అనుభవాలు ఉన్నాయని ఆయన అన్నారు. కెవిపిని విమర్శిస్తున్న విహెచ్ ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరై చిరంజీవి పార్టీ పరిస్థితి గురించి ఫిర్యాదు రూపంలో మాట్లాడడం, కెవిపి చర్యను బొత్స సమర్థించడం చూస్తుంటే ఇరువురి మధ్య అంతరం పెరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.