100 రోజుల్లోపే రూ.840 కోట్లు నిధులు.. మాట తప్పలేదన్న బండి సంజయ్
గత మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి ప్రత్యేక బాధ్యత తీసుకుంటానని వాగ్దానం చేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, తన మాటను నిలబెట్టుకున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.840 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర మంత్రి కట్టర్లకు ధన్యవాదాలు తెలిపిన ఎంపీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించిందని చెప్పారు.
మొండి పట్టుదలతో కేంద్ర పెద్దలను ఒప్పించా: బండి సంజయ్
జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో పాటు సంబంధిత అధికారులు కష్టపడి ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే పంపించడం వల్ల ఫలితాలు వేగంగా వచ్చాయని అభినందించారు. ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లోనే ఢిల్లీలో మీటింగ్ ఏర్పాటు చేసి, కేంద్ర బృందాన్ని కరీంనగర్కు పంపేలా చేశానని చెప్పారు . కొందరు అధికారులు యూసీఎఫ్ (Urban Challenge Fund) జాబితాలో కరీంనగర్కు చోటు దక్కదని అనుకున్నప్పటికీ, తన మొండి పట్టుదలతో కేంద్ర పెద్దలను ఒప్పించి జాబితాలో చేర్చించినట్లు ఎంపీ వివరించారు.

గతంలోనూ వెయ్యి కోట్లకు పైగా నిధులు తెచ్చి అభివృద్ధి
దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకు మాత్రమే ఆమోదం లభించిన నేపథ్యంలో కరీంనగర్ను చేర్చడం మనందరికీ గర్వకారణమని అన్నారు. యూసీఎఫ్ కింద డంపింగ్ యార్డు నిర్మాణం కోసం మాత్రమే రూ.80 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. గతంలో స్మార్ట్ సిటీ కింద రూ.900 కోట్లు, అమృత్ 1, 2 కింద రూ.277కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఈసారి యూసీఎఫ్ నిధులతో కరీంనగర్ కార్పొరేషన్ రూపురేఖలు మార్చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
త్వరలో పనులు మొదలు అవుతాయన్న బండి సంజయ్
శివారు ప్రాంతాల అభివృద్ధి, పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం, అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి పనులు త్వరగా చేపడతామని చెప్పారు. రూ.50 కోట్ల అర్బన్ డెవలప్మెంట్ ఫండ్తో రేపటి నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. మరో రూ.50 కోట్ల విడుదల కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యం
తన ఏడేళ్ల ఎంపీ పదవీ కాలంలో రూ.20 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు పేర్కొన్న బండి సంజయ్, శాతవాహన, ఎస్సారార్ కాలేజీలకు హోదా, అంబేద్కర్ స్టేడియం, జమ్మికుంట స్టేడియం, ఉచిత సైకిళ్లు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ను రాష్ట్రంలోనే మోడల్ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతానని, కేంద్ర పారామిలటరీ ఫోర్సెస్ బెటాలియన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications