కెసిఆర్, బాబులపై లగడపాటి ఫైర్, నో తెలంగాణ
కెసిఆర్ ఉద్యమాలు చేస్తే మంచిదేనని, ఉద్యమాల వల్ల రాజకీయ నాయకులు మాత్రమే లాభపడుతున్నారని, తమకు ఏ విధమైన ప్రయోజనం కలగడం లేదని ప్రజలు ఇప్పటికే గ్రహించారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ కేంద్ర మంత్రి వాయలార్ రవిని కలవడాన్ని ప్రస్తావించగా, కెసిఆర్ను చర్చలకు అహ్వానించలేదని, కేంద్ర మంత్రిగా ఉన్న వాయలార్ రవిని ఎవరైనా కలవవచ్చునని ఆయన అన్నారు. ఎవరైనా కలుస్తామంటే ఎందుకు కాదంటామని ఆయన అడిగారు.
రాష్ట్ర విభజన మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వలేమనే కాదు, ఇవ్వబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన అన్నారు. గతంలో ఇందిరా గాంధీ చెప్పినట్లుగా ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ఇవ్వబోమని చెప్పాలని ఆయన అన్నారు. దేశప్రయోజానాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ఇతర రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర విభజన మంచిది కాదని ఆయన అన్నారు.
చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తారనే వార్తలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, చంద్రబాబుపై మరోసారి మీడియాతో మాట్లాడుతానని చెబుతూనే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి ఆయన అన్నారు. చంద్రబాబు 1982 నుంచి ఇప్పటి వరకు ఏం మాట్లాడారనే విషయంపై ప్రదర్శన పెడుతానని ఆయన చెప్పారు. కాంగ్రెసులో ఉన్నప్పుడు, మంత్రిగా పనిచేసినప్పుడు, తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం మాట్లాడారనే విషయాన్ని తెలియజేయడానికి ఈనాడు పేపర్ కటింగ్స్తో ప్రదర్శన పెడుతానని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన నుంచి వెనక్కి పోలేదని, అయితే, అందుకు శాసనసభ తీర్మానం కావాలని అడిగిందని, శాసనసభ తీర్మానం సాధ్యం కాదని, అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని ఆయన అన్నారు. కొద్ది మంది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తెలంగాణను అడ్డుకుంటున్నారని చేసిన విమర్శలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, తాము కేంద్ర ప్రభుత్వం కన్నా బలవంతులమని అనుకుంటే మంచిదేనని ఆయన అన్నారు. తెలంగాణ అంశంతో సోనియా గాంధీకి సంబంధం లేదని, అది కేంద్ర ప్రభుత్వం చూడాల్సిందేనని ఆయన అన్నారు.