ప్రేమను నిరాకరించిందని ఢిల్లీలో యువకుడి ఘాతుకం
సౌత్ జిల్లా డిసిపి ఛాయాశర్మ తెలిపిన వివరాల ప్రకారం.. జెజె క్యాంప్ టిగ్రీకి చెందిన నీరజ్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను ఇష్టపడ్డాడు. ప్రేమ పేరుతో తరచూ ఆమె వెంటపడేవాడు. ఈనెల 7న సాయంత్రం ట్యూషన్కి వెళ్లి వస్తున్న బాలికను నీరజ్ అటకాయించాడు. ప్రేమించకపోతే దాడి చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక అతణ్ని తిట్టి వెళ్లిపోయింది.
ఈ విషయాన్ని చూసిన ఓ వ్యక్తి బాలిక మామకు చెప్పాడు. మరోమారు తమ బాలిక వెంటపడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాలిక బంధువులు నీరజ్ ఇంటికి వెళ్లి హెచ్చరించారు. దీంతో కోపోద్రిక్తుడైన నీరజ్ సాయంత్రం ఆరు గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు ఇఫ్రాన్, విశాల్ను వెంటపెట్టుకుని బాలిక ఇంటికి వెల్లాడు. బాలిక, ఆమె తల్లి కమలతో ఘర్షణకు దిగాడు. అప్పటికే తమతో తెచ్చుకున్న కర్రలు, కత్తితో అక్కడ ఉన్నవారిపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు.
బాలిక తల్లితో పాటు అడ్డు వచ్చిన పక్కింటివాళ్లను కూడా చితకబాదారు. ఈ ఘటన లో జగత్సింగ్ (60)అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోగా కమల సహా ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నీరజ్సైతం నేరం అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మిగిలిన ఇద్దరు నింది తులను అరెస్టు చేసినట్టు వారు చెప్పారు.