తెలంగాణ ఇస్తే దేనికైనా రెడీ!: వాయలార్తో కెసిఆర్
హైదరాబాద్ విషయంలో తాము మొదటి నుండి చేస్తున్న ప్రతిపాదనకే కట్టుబడి ఉన్నామని, సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఎలాంటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని, అలా తీసుకుంటే సహించేది లేదని చెప్పారని సమాచారం. నెలాఖరులోగా రాష్ట్ర విభజన ప్రకటన చేయాలని లేదంటే ఇప్పటికే ప్రకటించినట్లుగా తెలంగాణ మిలియన్ మార్చ్ భారీ ఎత్తున నిర్వహిస్తామని, రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని చెప్పారు.
హైదరాబాదును కొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచి ఆతర్వాత తెలంగాణ రాజధానిగా చేసే అంశానికి కెసిఆర్ ఓకే చెప్పారని సమాచారం. కాగా సమైక్యాంధ్రలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కెసిఆర్ వాయలార్ రవికి నివేదిక ఇచ్చారు. కెసిఆర్ వ్యాఖ్యలు సావధానంగా విన్న రవి అన్ని అంశాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యులకు వివరిస్తానని తెలిపారు.
బేటీ అనంతరం వాయలార్ రవి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటును కోరుతున్న కెసిఆర్ అదే విషయమై మాట్లాడేందుకు తనను కలిశారని, తెలంగాణ ఏర్పాటుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలను గురించి ఆయన వివరించారని, ఆయన చెప్పిన విషయాలను పూర్తిగా విన్నానని తెలిపారు.