తృతీయం యత్నాలు, మమతపై ములాయం ఆశ
న్యూఢిల్లీ: మరోసారి దేశంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెసు పార్టీ వరుస అవినీతి కుంభకోణాలతో బలహీనపడుతూ, బిజెపి నేతృత్వంలోని ఎన్డియే బలపడుతున్న నేపథ్యంలో తృతీయ ఫ్రంట్ యత్నాలు తెర మీదికి వచ్చాయి. కాంగ్రెసు, బిజెపిలకు వ్యతిరేకంగా తృతీయ ఫ్రంట్ ఏర్పడాల్సిన అవసరంపై సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ బుధవారం మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడడానికి అవసరమైన తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ఆయన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు కనిపిస్తోంది.
యుపిఎ, ఎన్డియేకు వ్యతిరేకంగా తృతీయ ఫ్రంట్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కలిసికట్టుగా ముందుకు రావాలని ఆయన అన్నారు. తృతీయ ఫ్రంట్ ఏర్పాటు వల్ల తమ తమ సంకీర్ణాలను బలోపేతం చేసుకోవడానికి ప్రాంతీయ, చిన్న పార్టీల మద్దతు లభించకుండా చూడాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి యుపిఎను నిందించాల్సి ఉందని, పార్టీగా బిజెపి ఎప్పటికీ పెరగదని, దీంతో దేశాన్ని ముందుకు నడిపించడానికి సమాజ్వాదీ పార్టీ పెద్ద బాధ్యతను తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ములాయం సింగ్ అన్నారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన ఆ మాటలు అన్నారు.ప్రజల అంచనాల మేరకు తమ పార్టీ పనిచేయాల్సి ఉందని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాల్సి ఉందని, పార్టీ ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి పార్టీ నాయకులంతా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అవినీతిని అరికట్టడంలో యుపిఎ విఫలమైందని, కుంభకోణాలు రోజువారి వ్యవహారాల్లాగా సర్వసాధారణమయ్యాయని ఆయన విమర్శించారు. కుంభకోణాలతో కాంగ్రెసు ప్రతిష్ట దెబ్బ తిన్నదని ఆయన అన్నారు.
యుపిఎకు ములాయం వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్నారు. అయితే, యుపిఎ ప్రజాదరణ తగ్గుతున్న నేపథ్యంలో ములాయం తృతీయ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు సాగించడం ఆశ్చర్యకరమేమీ కాదు. యుపిఎ, ఎన్డియేల ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసి ప్రధాని పదవిని అధిష్టించాలనే ఆశలు ములాయం సింగ్లో చిగురిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠంపై తన కుమారుడు అఖిలేష్ యాదవ్ను కూర్చోబెట్టడం కూడా జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలనే ఉద్దేశంతోనే అని చెబుతున్నారు. తమ పార్టీ ఉత్తరప్రదేశ్కు మాత్రమే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా తాము విస్తరిస్తామని ఆయన అన్నారు. ఎన్డియే, యుపిఎల్లో లేని పార్టీలతో తాను సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు. తమ పార్టీని దేశంలోని ఇతర ప్రాంతాల్లో బలోపేతం చేయాల్సి ఉందని ఆయన చెప్పారు
ఇదే సమయంలో ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దువ్వుతున్నారు. ఇందులో భాగంగా ఆయన అంతకు ముందు మమతా బెనర్జీని ప్రశంసలతో ముంచెత్తారు. మమతా బెనర్జీలో చాలా లక్షణాలున్నాయని, అందుకే ఆమె ముఖ్యమంత్రి కాగలిగారని ఆయన అన్నారు. ములాయం సింగ్ను బలపరచడానికి చిన్నపార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇప్పటి వరకు ముందుకు రాలేదు.
పార్లమెంటు సమావేశాల సందర్బంగా యుపిఎ బొగ్గు కుంభకోణానికి, ఎన్డియే వ్యవహార శైలికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో బిజెడి, అన్నాడియంకె పాలు పంచుకోలేదు. ఈ ధర్నాలో ఎస్పీతో పాటు వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ పాల్గొన్నాయి. దాంతో ఆ పార్టీలతో తృతీయ కూటమికి ప్రయత్నాలు సాగుతాయని అంచనా వేశారు.
2014 ఎన్నికలలోగా తృతీయ ఫ్రంట్ ఏర్పడుతుందని తాను భావించడం లేదని సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్ గుప్తా అన్నారు. ములాయం సింగ్ను బలపరిచే విషయంలో వామపక్షాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. 2009 మార్చిలో తృతీయ కూటమి ఏర్పడింది. సిపిఐ, సిపిఎం, జనతాదళ్ (సెక్యులర్), తెలుగుదేశం, బహుజన సమాజ్ పార్టీ, అన్నాడియంకె, తెలంగాణ రాష్ట్ర సమితి, రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, జనహిత్ కాంగ్రెసు పార్టీలతో ఆ తృతీయ ఫ్రంట్ ఏర్పడింది. అయితే, ఎన్నికల్లో అది సీట్లు సాధించడంలో విఫలమైంది. ప్రాంతీయ పార్టీలు, చిన్న పార్టీల మధ్య ఉన్న విభేదాలు సమసిపోతే తప్ప అది సాధ్యం కాదనే మాట వినిపిస్తోంది.