ఢిల్లీ కేంద్రంగా జనసేన..తేదీ ఖరార్ !!
సామాజిక సామరస్యం, బాధ్యతాయుతమైన రాజకీయ సంస్కృతిని పెంపొందించే దిశగా జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదివరకు 'సేన గళం' పేరుతో ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వయంగా దీన్ని ప్రారంభించారు. యువత, ముఖ్యంగా జెన్ జీ ఆకాంక్షలను ప్రతిబింబించేలా, రాజ్యాంగ విలువలపై నిలబడేలా ఈ వేదిక పనిచేయడానికి ఉద్దేశించిన ఓ నూతన వేదిక ఇది.
ఈ సేన గళం కమిటీ లక్ష్యాలు, మార్గదర్శకాలు కూడా ఇదివరకే వెల్లడయ్యాయి. ఆధునిక రాజకీయాలు రాజ్యాంగబద్ధంగా సాగాలని, సమాజంలోని అన్ని వర్గాలను గౌరవిస్తూ దేశ సమగ్రతను కాపాడటమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం. రాజకీయ చర్చలు కులం, మతం, ప్రాంతం వంటి అజెండాల చుట్టూ తిరుగుతుండటం వల్ల సమాజంలో అనవసర విభజనలు వస్తున్నాయనేది పవన్ కల్యాణ్ వాదన. ఇటువంటి ధోరణిని ఎండగట్టేలా సేన గళం పని చేస్తుందని గతంతో వెల్లడించారు.

విమర్శలకు కులాల ప్రాతిపదికన ప్రతిస్పందించే పాతకాలపు పద్ధతులను 'సేన గళం' తిరస్కరిస్తుందని, రాజకీయ భేదాలను వాస్తవాలు, ప్రజాహితం ఆధారంగానే పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కొందరు నాయకులు తమ తప్పిదాలను దాచుకునేందుకు కుల, మతాల ముసుగులో దాక్కుంటున్నారని, దీనిని యువత గమనిస్తూ తిరస్కరిస్తున్నారని విశ్లేషించారు. వ్యక్తిగత బాధ్యతను సామాజిక వర్గాలకు ఆపాదించడం ఆపాలని ఆయన కోరారు.
ఈ సేన గళం.. తన కార్యకలాపాలను ఇక ఢిల్లీలో విస్తరించబోతోంది.. పవన్ కల్యాణ్ సూచనల మేరకు. ఈ వేదిక ద్వారా ఢిల్లీలో కీలక కార్యక్రమాలకు తెరతీయబోతోన్నారాయన. ఈ నెల 14 నుంచి 16 వరకు సేన గళం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. జాతీయ స్థాయిలో చేరికలకూ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వేదిక ద్వారా జనసేన పార్టీ ఆలోచనలు, విధానాలను జాతీయ స్థాయిలో చర్చకు తీసుకురావాలనేది పవన్ ఆలోచన. ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఎంపిక చేసిన పార్టీ సీనియర్ నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. సేనా గళం చివరి రోజు పవన్ కల్యాణ్ పాల్గొంటారని, సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని, నాయకులకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. దేశ రాజధానిలో జనసేన ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి కావడంతో అందరి చూపూ దీని మీదే నిలిచింది.












Click it and Unblock the Notifications