జగన్ బెయిల్ కోసం మూడు ఒప్పందాలు: యనమల
తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కొత్త కేసులు పెట్టడదం, కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలీనం, వైయస్ జగన్ అక్రమాస్తుల కేసును నీరుగార్చడం ఆ మూడు ఒప్పందాలని ఆయన చెప్పారు. లేకుంటే జగన్ బెయిల్పై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి అని ఆయన అడిగారు. వైయస్ జగన్ కేసులో న్యాయవాదులను మార్చుకోవాలని న్యాయశాఖ సిబిఐకి సూచించిందని, సిబిఐ దర్యాప్తులో న్యాయ శాఖ జోక్యం చేసుకుంటోందని ఆయన అన్నారు.
వైయస్ జగన్ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వైయస్ జగన్కు న్యాయశాఖ సహకరిస్తోందని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఆదేశాల మేరకు సిబిఐ న్యాయవాదులను మార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయడం అందులో భాగమేనని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవోల వల్ల వైయస్ జగన్ సంపద కూడగట్టుకున్నారని, జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని ఆయన అన్నారు. వైయస్ విజయమ్మ ప్రకటనలు, పరిణామాలు చూస్తుంటే కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలీనమవుతుందనేది తెలిసిపోతూ ఉందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అస్తుల కేసులో ఇరుక్కుని ధర్మాన ప్రసాద రావు చేసిన రాజీనామా పెండింగులోనే ఉందని ఆయన అన్నారు.
తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రకటన చూస్తుంటే పదవుల కోసం వచ్చినట్లు కనిపించడం లేదని, సామాన్య కార్యకర్తగానే కొనసాగేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు పాదయాత్రపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన అన్నారు.