నేను మాట్లాడను: ఎస్పీ, డిజిపితో కానిస్టేబుల్ భేటీ
ఉద్యోగం కోసమే ఎస్పీ లక్షీనారాయణను నిర్బంధించానని హెడ్ కానిస్టేబుల్ గిరిప్రసాద్ శర్మ తెలిపారు. తాను చేసింది తప్పే అని, డీజీపీ తన తప్పును క్షమించి, తనపై ఎలాంటి కేసు పెట్టమని హామీ ఇచ్చినట్లు తెలిపారు. డీజీపీ తనకు తండ్రి లాంటి వారని శర్మ అన్నారు. తన సస్పెన్షన్ను ఎత్తివేసి పీటీవో నుంచి డీజీపీ కార్యాలయంలో ఉద్యోగం ఇస్తానని డిజిపి చెప్పినట్లు శర్మ మీడియాకు తెలిపారు.
ఎస్పీపై కక్షసాధింపు లేదన్నారు. గిరిప్రసాద్ శర్మ గత రాత్రి ఎస్పీని కిడ్నాప్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తన వ్యవహారంపై విచారణ జరుగుతుందని శర్మ చెప్పారు. పిటివో ఎస్పీ లక్ష్మీనారాయణను బుధవారం సాయంత్రం అపహరించి ఆరు గంటలపాటు హైదరాబాదులోని ఓ దుకాణంలో నిర్బంధించిన విషయం తెలిసిందే.
హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డిజిపి దినేష్ రెడ్డి జోక్యం చేసుకుని హామీ ఇవ్వడంతో గిరిప్రసాద్ శర్మ ఎస్పీ లక్ష్మీనారాయణను వదిలేశారు. బుధవారం రాత్రి పదిన్నర గంటల వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే, ఎస్పీ ఆ దుకాణానికి ఎందుకు వెళ్లారనే విషయం కూడా వివాదంగా మారింది.