ఇద్దరంటే నేనూ మా ఆవిడా, లోకేష్ వస్తేమిటి: బాబు
మీరు కూడా కార్యకర్తలుగా పని చేయవచ్చునని మీడియా ప్రతినిధులకు సూచించారు. పార్టీ మంచి కోసం పని చేయాలన్నారు. ‘ఏదో రాసుకుని సంతృప్తి పడుతున్నారు. మా అబ్బాయి వస్తే తప్పేముంది' అని ప్రశ్నించారు. బాబు విలేఖరుల సమావేశానికి వచ్చి ఇష్టాగోష్టి ప్రారంభించగానే ఒక్కరే వచ్చారా? ఇద్దరు వస్తారని అనుకున్నాం అని ఒక విలేఖరి ప్రస్తావించగా, ఇద్దరంటే ఎవరు నేనూ మా ఆవిడ అనుకున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కాదు లోకేశ్ అని మరో విలేఖరి చెప్పగా ఆయన తీవ్రంగా స్పందించారు.
కార్యకర్తగా వస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ అంశంపై ఇంకా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు.సాధారణంగా పార్టీలో మరో నాయకుడి సూచనలు, సలహాల గురించి ప్రస్తావించని చంద్రబాబు, తొలిసారిగా 2009 ఎన్నికలకు ముందు రెండు వేల రూపాయల నగదు బదిలీ పథకం తన కుమారుడి ఆలోచన అని చెప్పుకొచ్చారు. తరువాత అనేక సందర్భాల్లో తన కుమారుడి చదువు, వ్యాపారంలో తెలివి తేటల గురించి చెబుతూ వచ్చారు. గత మహానాడు సమయంలో కొందరు లోకేష్ రాజకీయాల్లోకి రావాలని బ్యానర్లు ప్రదర్శించగా, ఒకరిద్దరు అలా చేయడం తగదని బాబు తెలిపారు. చంద్రగిరి నియోజక వర్గం టిడిపి నాయకులు లోకేష్కు పార్టీలో బాధ్యతలు అప్పగించాలంటూ తీర్మానం చేశారు.
ఎన్నికల సమయంలో టీవిల్లో ప్రకటనలు రూపొందించడం ద్వారా లోకేష్ ఇప్పటి వరకు టిడిపికి తెరవెనుక నుంచి పని చేశారు. చంద్రబాబు రైతు దీక్ష జరిపినప్పుడు దీక్షా శిబిరంలో లోకేశ్ చాలాసేపు కూర్చున్నారు.తెర వెనుక టీవిలో పార్టీ ప్రచార బాధ్యతలు చూసినా, మీడియాతో మాత్రం లోకేష్ గతంలో ఎప్పుడూ మాట్లాడలేదు. తొలిసారిగా రిహార్సల్స్ తరహాలో చిత్తూరు జిల్లాలో మీడియాతో మాట్లాడించారు. తాను పార్టీలో సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని లోకేష్ ప్రకటించారు. అదే చంద్రబాబు సైతం లోకేష్ కార్యకర్తగా కొనసాగుతానని అంటే తప్పేంటని ప్రశ్నించారు.
లోకేష్ ఆ వెంటనే యువతకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించారు. సాధారణ కార్యకర్తగా కొనసాగుతానని ప్రకటించిన లోకేశ్, యువతకు ప్రాధాన్యత ఇస్తాననే విధాన ప్రకటన చేయడం విశేషం. బాబు తరువాత పార్టీలో పెత్తనం తనదేననే ఆలోచనకు లోకేష్ వచ్చేసినట్టు దీన్నిబట్టి అర్థమవుతోందని టిడిపి వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.