అప్పుడే జగన్ను ఎందుకు అరెస్టు చేయలేదు: సుప్రీం
వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణను కూడా సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. వైయస్ జగన్ బెయిల్ పిటిషన్పై సిబిఐ తరఫున మోహన్ జైన్ సుప్రీంకోర్టులో వాదించారు. జగన్ తరఫున గోపాల సుబ్రహ్మణ్యం వాదించారు. వైయస్ జగన్ సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంటూ బెయిల్ ఇవ్వరాదని సిబిఐ వాదించింది.
ఐదేళ్లలో వైయస్ జగన్కు వేలాది కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జగన్ విచారణకు సహకరిస్తుంటే అరెస్టు చేశారని, మూడు రోజుల పాటు విచారించిన తర్వాత అరెస్టు చేశారని, అందువల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని, ఇప్పటికే జగన్ 90 రోజులకు పైగా జైలులో ఉన్నారని వాదిస్తూ జగన్కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. విచారణ కూడా పూర్తి స్థాయిలో జరిగిందని, ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే విషయంపై సమాచారం సేకరించలేకపోయారని ఆయన అన్నారు.
సాక్షులను తారుమారు చేస్తారని చెప్పడానికి తమ వద్ద ఆధారాలున్నాయని, కావాలంటే సీల్డ్ కవర్లో వాటిని కోర్టుకు అందిస్తామని, అందుకు అనుమతించాలని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ సుప్రీంకోర్టుకు విచారణ సందర్భంగా వచ్చారు. జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి కూడా కోర్టుకు వచ్చారు.