లేడీ టీచర్ గుంజీల శిక్షకు హైదరాబాదులో విద్యార్థి బలి
ఈనెల 3న తరగతి గదిలో స్నేహితులతో ఇస్మాయిల్ మాట్లాడుతుండగా ఆగ్రహించిన ఉపాధ్యాయురాలు మెదీనా బేగం అతన్ని పాఠశాల నాలుగు అంతస్తులలోని అన్ని తరగతులను తిప్పి గుంజీలు తీయించింది. మొదటి నుంచి కాళ్లకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఇస్మాయిల్ అతిగా గుంజీలు తీయడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తిప్పి చికిత్స చేయించారు. గురువారం ఉదయం పురానాహవేలీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఇస్మాయిల్కు గతంలో సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలులో రాడ్ వేశారని, గుంజీలు తీయించడంతో నొప్పి తీవ్రమైందని, చికిత్స చేయించినా అబ్బాయిని దక్కించుకోలేకపోయామని కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయల్ ఎంబసీ పాఠశాలలో చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థిని శిక్షించిన ఉపాధ్యాయురాలిపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. ఇదే పాఠశాలలో గత జులై నెలలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. అప్పట్లో ప్రధానోపాధ్యాయురాలిని మాదన్నపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.