విలీనం మాకవసరమా?: మీడియాకు విజయమ్మ ప్రశ్న

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలో పెళ్లి జరగనుందని వ్యాఖ్యానించిన తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలను మీడియా విజయమ్మను ప్రశ్నించింది. అందుకు ఆమె.. తమ పార్టీకి విలీనం అవసరమా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో తమ పార్టీని ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించారని, అలాంటి ప్రజలను తాము మోసం చేయమన్నారు.
రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న తమ పార్టీకి విలీనం అవసరమని మీరు భావిస్తున్నారా అని, ఏ ఒక్కరైనా విలీనం అవసరమని చెప్పగలరా అని విజయమ్మ అన్నారు. తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం విలీనం అవుతుందన్న వ్యాఖ్యలను కూడా ఆమె కొట్టిపారేశారు. జగన్ జైలుకు వెళ్లి తొంబై రోజులు దాటిందని, అలాంటప్పుడు న్యాయపరంగా బెయిల్ వస్తుందన్నారు.
బెయిల్కు విలీనానికి సంబంధం లేదన్నారు. జగన్ ఆస్తులపై సిబిఐ 13 నెలలుగా విచారణ జరుపుతోందని, అతనిని జైలుకు పంపించి మూడు నెలలు దాటిదని అయినప్పటికీ ఇప్పటి వరకు సిబిఐ జగన్ అవినీతిపరుడని నిరూపించలేక పోయిందన్నారు. జగన్కు బెయిల్ ఖచ్చితంగా వస్తుందన్నారు. సొంత పార్టీ నేతలను తమ పార్టీలో చేరకుండా అడ్డుకునేందుకే టిడిపి విలీనం కుట్రకు తెరలేపిందన్నారు.
అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు ఉండాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెసులు అసెంబ్లీ సమావేశాలు జరగవద్దని కోరుకుంటున్నాయని, చేనేత కార్మికుల సమస్యలు, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కమిటీపై చర్చించాలని కోరినట్లు ఆమె చెప్పారు. కాగా అంతకుముందు టిడిపి బిఏసి సమావేశం నుండి వాకౌట్ చేశారు. సమావేశాలకు నాలుగు రోజులు సరిపోవని ఇరవై రోజులు ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications