అదృశ్యమైన టెక్కీ రైల్వే ట్రాక్పై శవమై తేలాడు
హర్యానాలోని హోడల్ ప్రాంతంలో రైల్వే ట్రాక్పై 26 ఏళ్ల సుమిత్ పరిహార్ మరణించి ఉంటాడని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలోని అతని బంధవులకు ఈ నెల 10వ తేదీన అతని సిమ్ కార్డు లభించింది. అయితే, తదుపరి చర్యలు చేపట్టడంలో పోలీసులు పెద్దగా శ్రద్ధ చూపలేదనే విమర్శలున్నాయి.
సుమిత్ సెల్ఫోన్ను పోలీసులు సోమవారంనాడు పల్వాల్ సమీపంలో గుర్తించారు. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు సాగించారు. దీంతో ఢిల్లీ - ఆగ్రా రైల్వే ట్రాక్పై ఒకతను మరణించి ఉండడాన్ని రైల్వే పోలీసులు గుర్తించినట్లు, శవాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించినట్లు, ఆ తర్వాత మూడు రోజులకు గుర్తు తెలియని శవం పేరుతో అంత్యక్రియలు నిర్వహించినట్లు తేలింది.
సుమిత్ కేసు కూడా ఇటీవలి పరస్ భాసిన్ కేసును పోలి ఉంది. పరస్ బాసిన్ అనే టాటూ ఆర్టిస్టు ఇటీవల రైల్వే ట్రాక్పై మరణించిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల క్రితం మరణించిన వ్యక్తిని పోలీసులు గుర్తించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని సుమిత్ బంధవులు ప్రశ్నిస్తున్నారు. సఫ్దర్జంగ్ పోలీసు స్టేషన్ ఎదుట నిరసన ప్రదర్శన జరిపిన తర్వాతనే పోలీసులు కదిలారని అంటున్నారు.
బాధితుడి డిఎన్ఎను నిలువ చేసినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆత్మహత్యకు సంబంధించిన కేసు కావచ్చునని అంటున్నాయి. పరిహార్ కొందరు మిత్రులతో ఫోన్లో కొన్ని గంటల పాటు మాట్లాడాడని, వారిని తాము ప్రశ్నిస్తున్నామని పోలీసులు అంటున్నారు. పరిహార్ కేసు విషయంలో పోలీసులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. గుర్తు తెలియని శవం కనిపించిందని రైల్వే పోలీసులు సుమిత్ అదృశ్యమైన రెండు రోజులకు చెప్పారని వారంటున్నారు. శవానికి రైల్వే పోలీసులు అంత్యక్రియలు చేశారని, ఆ తర్వాతే అతను సుమిత్ అని తెలిసిందని వారు చెబుతున్నారు.
మధురకు చెందిన పరిహార్ ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎంక్లేవ్లో ఉంటున్నాడు. నోయిడాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తన్నాడు. తాము సెప్టెంబర్ 9వ తేదీన ఫోన్లు చేస్తే అది స్విచాఫ్ అయి ఉందని సుమిత్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.