తెలంగాణ ఫ్యూచర్సిటీలో మరో 37 గ్రామాలు విలీనం.. ఆ విజ్ఞప్తులతో రేవంత్ నిర్ణయం!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'ఫోర్త్ సిటీ' లేదా 'భారత్ ఫ్యూచర్ సిటీ' నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ప్రాజెక్టు పరిధిని మరింతగా విస్తరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి కొత్తగా గ్రామాల విలీనం
స్థానిక రైతులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి కొత్తగా మరో 37 గ్రామాలను విలీనం చేయడానికి సీఎం ఆమోదం తెలిపారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ ఆయన ఫైలుపై సంతకం చేశారు.

సీఎం సభలో గ్రామస్తుల అభ్యర్ధన
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఎఫ్సీడీఏ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తున్న సమయంలో.. తమ గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో చేర్చాలంటూ స్థానిక ప్రజలు ప్లకార్డులతో అభ్యర్థించారు.
కందుకూరు, మహేశ్వరం మండలాల్లో 37 గ్రామాలు ఫ్యూచర్ సిటీలో విలీనం
దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సంకల్పానికి గౌరవమిస్తూ రేవంత్ రెడ్డి అక్కడికక్కడే సానుకూల నిర్ణయం ప్రకటించారు. కొత్తగా విలీనమయ్యే ఈ 37 గ్రామాలలో మహేశ్వరం మండలానికి చెందిన 28 గ్రామాలు, కందుకూరు మండలానికి చెందిన 9 గ్రామాలు ఉన్నాయి.ఈ సందర్భంగా ఎఫ్సీడీఏ పోర్టల్ను కూడా ప్రారంభించిన ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తామంటూ కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గతంలో హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను కూడా ఇలాగే వ్యతిరేకించారని, కానీ ఈరోజు అవే హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చాయని గుర్తుచేశారు. ఈ ప్రాంతంలో భూముల విలువ బంగారం కంటే ఎక్కువగా పెరిగిందని, భవిష్యత్తులో స్థానికులతో చర్చించి మరికొన్ని గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో భాగస్వామ్యం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications