వక్రీకరించొద్దని వార్నింగ్: కాంగ్పై కాళీగా మారిన మమత
బందులపై తమకు ఏమాత్రం నమ్మకం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కాంగ్రెసు ముందు ఆమె తన డిమాండ్లు మరోసారి బహిరంగంగా ఉంచారు. డీజిల్ ధరను రూ.3 తగ్గించాలని, గ్యాస్ సబ్సిడీని 24 సిలిండర్లకు పెంచాలని, ఎఫ్డిఐల విషయంలో మాత్రం తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆమె చెప్పారు. కాంగ్రెసు నేతలు తమతో చర్చలు జరపలేదన్నారు. కాంగ్రెసు దుష్ప్రచారం వల్ల అయోమయం ఏర్పడుతోందన్నారు.
గత నాలుగు రోజులుగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయం తనతో సంప్రదింపులు జరిపేందుకు ప్రయత్నించిందన్న కాంగ్రెసు నేతల వ్యాఖ్యలపై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రజలకు నిజాలు చెప్పాలన్నారు. వక్రీకరించి అయోమయానికి గురి చేయవద్దన్నారు. తనను ఎవరూ సంప్రదించే ప్రయత్నాలు చేయలేదన్నారు. రైల్వే మంత్రి, టిఎంసి నేత ముకుల్ రాయ్ కూడా కేంద్రం మమతతో సంప్రదింపులు జరిపే ప్రయత్నాలు చేసిందన్న వార్తలను కొట్టిపారేశారు.
మాట్లాడాలని భావించాం.. చిదంబరం
మమతా బెనర్జీతో తాము మాట్లాడాలని భావించామని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. ఆమె చర్చలకు సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. తృణమూల్ కాంగ్రెసును ఒప్పించే ప్రయత్నం చేస్తామని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని చిదంబరం తెలిపారు. కాంగ్రెసు పాలిత రాష్ట్రాల్లో సబ్సిడీ సిలిండర్లను 6 నుండి 9కి పెంచారని, కాంగ్రెసేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా గ్యాస్ పైన సబ్సిడీ ఇవ్వాలని జనార్దన్ ద్వివేది సూచించారు.
కాంగ్రెసు పార్టీ మునుగుతున్న నావ అని బిజెపి నేత షాన్వాజ్ హుస్సేన్ అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం కాకుండా విదేశీ ప్రయోజనాల కోసం సంస్కరణలు చేపడుతోందన్నారు. మన్మోహన్ సింగ్ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. యూపిఏ-2 పాలన ఈస్టిండియా కంపెనీ కంటే దరిద్రంగా ఉందని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. బీహార్కు ప్రత్యేక హోదా కల్పించే వారికి తాము మద్దతిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.