ఆఖరి దశలో చెప్తా, సులభం కాదు : తెలంగాణపై కిరణ్
తెలంగాణపై సరైన సమయంలో నిర్ణయం వస్తుందన్నారు. తెలంగాణ మార్చ్ వాయిదాకు ఇంకా సమయముందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, పార్టీలతో ముఖ్యంగా కాంగ్రెసు పార్టీలోని మూడు ప్రాంతాల వారితో చర్చించాల్సి ఉంటుందని, ఆ తర్వాత కాంగ్రెసు అధిష్టానం తన నిర్ణయాన్ని వెలువరించాలని, ఆపై కేంద్రం అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
తెలంగాణ అంశంపై చర్చలు జరపటం కొత్త కాదని, ఇది ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ప్రక్రియ అన్నారు. ఢిల్లీలో ఏదో జరగకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో ఉండరన్నారు. జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో 30న జరిగే మార్చ్ వాయిదా వేసుకోవాలని అన్ని పార్టీల వారిని కోరామని, మార్చ్ ప్రభావం ఉంటుందా లేదా చూడాలన్నారు. 1969లో ఇంతకన్నా పెద్ద ఉద్యమం జరిగిందన్నారు. అప్పుడు కాల్పుల వరకు కూడా దారి తీసిందన్నారు.
డిసెంబర్ కన్నా ముందు మరోసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. 29న గణేష్ నిమజ్జనం జరగనున్నందున భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించలేక పోయామన్నారు. తెలంగాణ వచ్చేసిందని మీడియా చెప్పడం వల్ల ఇరు ప్రాంతాల నేతలు సమావేశాలు పెట్టుకుంటున్నారని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లాలని ఇప్పటికైతే అనుకోవడం లేదని చెప్పారు. తాము జారీ చేసిన జివోలు బిజినెస్ రూల్స్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అన్న వాటిపై మంత్రులు జ్యూడిషియల్ విచారణ కోరారన్నారు.