రాజీనామాకు తెలంగాణ మంత్రులు రెడీ: మార్చ్ వేడి

Jana Reddy - Damodar Rajanarasimha
హైదరాబాద్: రాష్ట్రసాధన కోసం రాజీనామాలు చేసేందుకు తెలంగాణ మంత్రులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ మార్చ్ కాకతో ఈ దిశగా ప్రకటనలు కూడా చేస్తున్నారు. ఈసారి రాజీనామాలు చేస్తే మాత్రం ఇక వెనకడుగు వేసేది లేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి జానారెడ్డి ప్రకటించారు. తెలంగాణ మార్చ్‌కి ఒకవైపు అనుమతిని ఇచ్చి, మరోవైపు ఆంక్షలు విధించడం ఏమిటని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డిపై డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఆకాంక్ష, గుండెకోత, మనోవేదనలపై చర్చించేందుకు జానారెడ్డిని కలిశానని చెప్పారు. జేఏసీ నేతలకు కూడా శాంతియుతంగా నిరసన తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అసాంఘిక శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని, దీనిపై ఓ కన్నేసి ఉంచాలని పోలీసులకు చెప్పానన్నారు. ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయడం బాధాకరమని, తాము రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నామని రాజనరసింహ చెప్పారు. ఈసారి రాజీనామా చేస్తే వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మార్చ్ నిర్వహించేందుకు అనుమతిని ఇచ్చినట్లే ఇచ్చి ఈ నిర్బంధం ఏమిటని డీజీపీ దినేష్‌రెడ్డిని రాజనరసింహ ప్రశ్నించారు. రాష్ట్రంలో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎవరినీ నిర్బంధించ లేదని డీజీపీ దినేష్‌రెడ్డి వివరించారు. ఎక్కడ పడితే అక్కడ నిర్బంధిస్తున్నట్లు సమాచారం వస్తుంటే .. లేదంటే ఎలాగని రాజనరసింహ అసహనం వ్యక్తం చేశారు.

ప్రజల ఆకాంక్ష మేరకు అవసరమైతే పదవిని లెక్కచేయని పరిస్థితులు వచ్చాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. అవసరమైతే మంత్రివర్గంలో కొనసాగాలా, వద్దా అనే విషయం ఆలోచిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ జేఏసీ మార్చ్ తలపెట్టిందని, ఆందోళన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, ప్రభుత్వానికి అప్రతిష్ఠ రాకుండా, హింసకు తావులేకుండా మార్చ్ నిర్వహిస్తామని జేఏసీ నేతలు హామీ ఇచ్చారని, ఆ హామీలను నిలబెట్టుకోవాలని కోరారు.

ప్రశాంతంగా మార్చ్ నిర్వహించేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలన్నారు. ప్రజాసంఘాలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. మార్చ్‌కు వచ్చిన వారిని పోలీసులు నిరోధించడం తగదన్నారు. ఇదే విషయం సీఎంకు చెప్పానని, మార్చ్‌కి వచ్చేవారిని అడ్డుకోకుండా పోలీసులను ఆదేశిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. మార్చ్ సమయంలో సంయమనాన్ని పాటించాలని అన్ని వర్గాలనూ జానారెడ్డి కోరారు. తెలంగాణ ఆకాంక్ష ఏ మేరకు ఉందో ఈ మార్చ్ ద్వారా కేంద్రానికి ఒక సందేశంగా పంపాలని కోరారు.

మార్చ్‌కి వచ్చేవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు వస్తున్న సమాచారంపై సీఎం కిరణ్‌తో మాట్లాడేందుకు జానారెడ్డి ప్రయత్నించగా, సీఎం అందుబాటులోకి రాకపోవడంతో మాజీ మంత్రి షబ్బీర్ అలీకి జానారెడ్డి ఫోన్ చేసి, సీఎంతో మాట్లాడాలని కోరారు. ఈ మేరకు సీఎంతో షబ్బీర్ మాట్లాడారు. తాను ఎలాంటి నిర్బంధం విధించడం లేదని, అసాంఘిక శక్తులను నిరోధించడానికి తనిఖీలు మాత్రమే చేస్తున్నామని షబ్బీర్‌తో సీఎం చెప్పారు. తర్వాత జానారెడ్డికి సీఎం అందుబాటులోకి వచ్చారు.

తెలంగాణ మార్చ్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి.విష్ణువర్దన్‌రెడ్డిని ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. మార్చ్‌కి వెళ్లేముందు పీజేఆర్ విగ్రహానికి విష్ణు పూలమాల వేశారు. ఆయన మార్చ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతుంటే అటు వైపు వెళ్లేందుకు వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విష్ణుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో విష్ణుతో పాటు, పీసీసీ ప్రధాన కార్యదర్శి జి.నిరంజన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+