'తెలంగాణ కవాతు'పై సిట్: కోదండ, విద్యార్థులపై కేసు
దర్యాప్తు బాధ్యతను సిసిఎస్లోని స్పెషల్ సిట్కి అప్పగించారు. ఖైరతాబాద్, నెక్లెస్ రోడ్డుల్లో ఆందోళనకారులు జరిపిన విధ్వంస ఘటనలపై మొత్తం మూడు ఫిర్యాదులు అందాయి. వాటిలో మార్చ్ సందర్భంగా గాయపడిన ఐపీఎస్ అధికారి రాజశేఖర్ ఫిర్యాదు కూడా ఉంది. ఈ మేరకు మార్చ్ నిర్వాహకులు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం, తెలంగాణ స్టూడెంట్ యాక్షన్ కమిటీ తదితరులపై ప్రివెంటివ్ డ్యామేజెస్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ (పిడిపిపి) యాక్టు ప్రకారం సెక్షన్ 143, 147, 435 రెడ్విత్ 149, 3 అండ్ 4 కింద కేసులు నమోదు చేశామని మధ్య మండలం డిసిపి తరుణ్ జోషి తెలిపారు.
నెక్లెస్ రోడ్డులో రైల్వే కౌంటర్ ధ్వంసంపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్పీ కాంతారావు తెలిపారు. కాగా, నగర పోలీస్ అదనపు కమిషనర్ (క్రైమ్స్) హసన్ రెజానేతృత్వంలో సిసిఎస్ డిసిపి విక్టర్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎసిపిలు, నలుగురు ఎస్ఐలు, మరికొంతమంది సిబ్బందితో కూడిన బృందం రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేసింది. త్వరలోనే పాత్రధారులు, సూత్రధారులను పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
ఇదిలాఉండగా, అసెంబ్లీ వెలుపల ఆందోళనకు దిగిన టిడిపి ఎంపి, ఆ పార్టీకి చెందిన పదిమంది ఎమ్మెల్యేలు, ఇద్దరు నేతలపైనా సెక్షన్ 151 కింద కేసులు నమోదయ్యాయి. కాగా, తెలంగాణ మార్చ్ సందర్భంగా ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు, తుపాకులతో కాల్పులు జరిపామంటూ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్శర్మ వివరణ ఇచ్చారు. కేవలం బాష్పవాయువునే ప్రయోగించామన్నారు.