యాత్ర వర్సెస్ యాత్ర: వేటు భయంతో బైరెడ్డి రాజీనామా
ఈ నేపథ్యంలో ఆయన బాబుకు గతంలో ఓ లేఖ కూడా రాశారు. పార్టీ తరఫున కేంద్రానికి తెలంగాణ అంశంపై లేఖ రాస్తే రాయలసీమ విషయమై కూడా రాయాలని సూచించారు. అయితే బాబు తన యాత్రకు ముందు తెలంగాణపై కేంద్రానికి లేఖ రాసినప్పటికీ అందులో బైరెడ్డి సూచించినట్లుగా రాయలసీమ అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి టిడిపికి రాజీనామా చేశారు. బాబు సీమ నేత అయి ఉండి రాయలసీమ గురించి ఆలోచించలేదంటూ తీవ్రంగా నిప్పులుగక్కారు. తెలంగాణపై లేఖ రాసి సీమను ప్రస్తావించనందున తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
అయితే బైరెడ్డి పార్టీని వీడింది తెలంగాణపై లేఖ రాసినందుకు మాత్రమే కాదంటున్నారు. తెలంగాణపై వెంటనే తేల్చాలని, అఖిలపక్షం ఏర్పాటు చేయాలని బాబు రాశారని అందులో తప్పు పట్టేందుకు ఏమీ లేదని చెబుతున్నారు. అయినప్పటికీ పార్టీని వీడిన వారు ముందస్తు ప్లాన్ ప్రకారమే అలా చేశారని అంటున్నారు. బైరెడ్డి అక్టోబర్ రెండవ తారీఖు నుండి రాయలసీమ ఆత్మగౌరవ యాత్రను తలపెట్టారు. చంద్రబాబు కూడా అదే రోజు నుండి హిందూపురం సూగురు నుండి 117 రోజుల యాత్ర తలపెట్టారు.
పార్టీ అధినేత యాత్ర నేపథ్యంలో పలువురు నేతలు బైరెడ్డిని తన యాత్రను వాయిదా వేసుకోవాలని లేదా విరమించుకోవాలని సూచించారట. కానీ ఆయన మాత్రం బెట్టు వీడలేదు. బాబు పాదయాత్ర ప్రారంభించే సమయం వరకు కూడా బైరెడ్డి వెనక్కి తగ్గని పక్షంలో వేటు వేయాలని బాబుపై పలువురు నేతలు ఒత్తిడి తెచ్చారట. పార్టీలో దాదాపు నిర్ణయమైపోయందట. ఇది తెలుసుకున్న బైరెడ్డి పార్టీ వేటు వేసేకంటే ముందు తానే రాజీనామా చేసి రాయలసీమ జిల్లాల్లో ఇమేజ్ పెంచుకోవాలని భావించారట.
అందుకోసం ఆయన సమయం కోసం వేచి చూసి.. బాబు తెలంగాణను తేల్చాలని ప్రధానమంత్రికి లేఖ రాసిన వెంటనే బయటకు వచ్చి తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినట్లుగా చెబుతున్నారు. ఎలాగూ వేటు వేస్తారని తేలినందున... అలా జరిగితే వచ్చే లాభం ఏమీ లేదని, ముందే రాజీనామా చేస్తే సీమ కోసం అన్న ఇమేజ్ ఉంటుందని ఆయన భావించారని అంటున్నారు.