తెలంగాణపై, పార్టీల విలీనంపై జాతీయ మీడియాతో సిఎం
పార్టీలో ఐక్యత ఉంటే ఎవరి మద్దతు అవసరం లేకుండా కాంగ్రెసు సొంతగా గెలుస్తుందన్నారు. తెలంగాణపై తేల్చాలని డెడ్ లైన్ పెట్టడం సరికాదన్నారు. కేంద్రం కూడా తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తాను కూడా అధిష్టానాన్ని త్వరగా నిర్ణయం తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. తెలంగాణపై కేంద్రం అందరి అభిప్రాయాలను సేకరిస్తోందని, సర్వామోద అభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
పార్టీ అధిష్టానం రాష్ట్రంలో జరిగే అన్ని పరిణామాలను గమనిస్తోందని, తెలంగాణ అంశంపై ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో చూస్తోందన్నారు. తాను తెలంగాణ అంశంపై అధిష్టానానికి ఎలాంటి నివేదికలు పంపలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు.
తెరాస అయినా వైయస్సార్ కాంగ్రెసు అయినా కాంగ్రెసులో విలీనమయ్యే అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు. తనపై తెలంగాణ వ్యతిరేక ముద్ర వేసిన సొంత పార్టీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన తెలంగాణ కవాతు విషయంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి మాట తప్పిందన్నారు. ప్రభుత్వం శాంతిభద్రతలపై రాజీపడదన్నారు.