నాలుగో రోజు పాదయాత్ర: నాగలి పట్టిన చంద్రబాబు
అక్కడి నుంచి కొగిరి, రాగిమేకపల్లి, రాచూర్, ఎర్రబెంచి మీదుగా గరికమేకపల్లి వరకు చంద్రబాబు పాదయాత్ర సాగనుంది. రాగిమేకపల్లిలో మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోనున్నారు. ఎక్కడ మహిళలు కనిపించినా వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. యువకులను 'తమ్ముళ్లూ!' అంటూ సంబోధిస్తూ నడుస్తున్నారు. వారి కష్టాలను సావధానంగా ఆలకిస్తూ ఓదార్పునిస్తున్నా రు. మన ప్రభుత్వం రాగానే కష్టాలన్నీ గట్టెక్కుతాయని హామీ ఇస్తూ ఆయా వర్గాలను ప్రభావితం చేస్తున్నారు. తనకోసం వేచి ఉన్న మహిళల దగ్గరికి వెళ్లి 'మీ కష్టాలేంటమ్మా.. చెప్పండి' అంటూ వారిని పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
వారిని కూడా యాత్రలో భాగస్వాములను చేస్తున్నారు. నడుస్తూనే మహిళలు, యువకులు, రైతులు, కార్మికులు తనతో చెప్పుకుంటున్న సమస్యలను ఆలకిస్తున్నారు. 'ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పాలంటూ వారి నుంచి సూచనలు కూడా స్వీకరిస్తున్నారు. సమస్యలన్నింటికీ పాలకుల అసమర్థ పనితీరే కారణమని నిట్టూర్చారు. ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదనే బాధతోనే ఈ యాత్ర చేపట్టానని ప్రజలకు వివరిస్తున్నారు. ఈ యాత్రతోనైనా అవినీతి పాలకుల అరాచకాలు, దోపిడీ గురించి తెలుసుకుని ప్రజలు చైతన్యవంతులవుతారనే ఉద్దేశంతోనే ఈ వయసులో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.
తన పాదయాత్రలో చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కుడున్నారో తెలియడం లేదని విమర్సించారు. ప్రభుత్వం రైతులను విస్మరించిందని అన్నారు. ప్రజల కష్టాలు తీర్చేవారు లేకుండా పోయారని ఆయన అన్నారు.