హీరోయిన్కు సినిమా కష్టాలు: లైంగిక వేధింపులు?
అక్కున చేర్చుకుని వేధింపుల నుంచి రక్షిస్తుందనుకున్న కన్నతల్లి బాబాయికి వంతపాడింది. చెప్పినట్టు వినకపోతే యాసిడ్ పోస్తామని, గొంతుకోసి చంపేస్తామని బెదిరించారు. తల్లి ప్రవర్తనపై అసంతృప్తితో వారం రోజుల పాటు ఇంట్లో భోజనం మానేసి తన నిరసన తెలియజేస్తే.. ఇంట్లో నుంచి బయటకు పోవాలని, లేకపోతే తామే మెడపట్టి గెంటేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రాణాలుదక్కించుకునేందుకు రహస్యంగా ఇంట్లో నుంచి బయటపడింది. రైల్వేస్టేషన్ డార్మెటరీలో రెండు రోజులపాటు తలదాచుకుంది. చివరకు న్యాయం కోసం మీడియా ముందుకు వచ్చింది.
సినిమా కథను తలపించే హీరోయిన్ కన్నీటి గాథపై బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ విశాలాక్షినగర్కు చెందిన దివ్య సేన్(19) ఇంటర్ వరకు చదువుకుంది. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తల్లి లోకేశ్వరి, సోదరితో కలిసి ఉటోంది. దివ్య బాబాయి వాళ్ల ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటూ పెద్ద దిక్కుగా ఉంటున్నారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో నటనలో శిక్షణ పొందింది. ప్రస్తుతం ప్రళయం సినిమా షూటింగ్ జరుగుతోంది.
దివ్య వ్యవహరాలన్నీ ఆమె బాబాయే చూసుకుంటారు. ఇటీవల అతడి వ్యవహారశైలిలో మార్పు వచ్చింది. షూటింగ్ల కోసం బైక్పై దివ్యను తీసుకెళ్లేటప్పుడు అసభ్యంగా ప్రవర్తించసాగాడు. పార్కులకు రావాలని బలవంతపెట్టాడు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో విషయాన్ని తల్లి లోకేశ్వరికి చెప్పింది. ఆమె కూడా బాబాయికి వంతపాడింది. తాము చెప్పినట్టు వినాలని, లేనిపక్షంలో ఇంట్లో నుంచి బయటకు పోవాలంటూ హుకుం జారీచేసింది. చివరకు దివ్య ఈ విషయాన్ని తన పెద్దమ్మకు చెప్పింది. ఆమె నుంచి స్పందన లేకపోవడంతో వారంగా ఇంట్లో భోజనం చేయడం మానేసింది.
ఈ నెల ఒకటో తేదీ రాత్రి దివ్యకు, ఆమె తల్లికి వాగ్వాదం జరిగింది. దీంతో.. రెండో తేదీ కట్టుబట్టలతో బయటపడి రైల్వే స్టేషన్లోని డార్మెటరీలో తలదాచుకుంది. ఉన్న డబ్బులు ఖర్చై పోవడంతో చేసేది లేక మీడియా ముందుకు వచ్చింది. దివ్య చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని ఆమె తల్లి లోకేశ్వరి తెలిపారు. తన కుమార్తె ఎవరి మాయలోనో పడిందని, వారి ప్రోద్బలంతోనే తమపై ఆరోపణలు చేస్తున్నదని తల్లి చెబుతున్నారు.