ఈ వేధింపులు ఏ సిఎంకు లేవు: మోడీ, ప్రధానికి సవాల్
కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ఢిల్లీ సుల్తాన్స్తో పోల్చారు. కేంద్రం తనను వేధిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఏ గుజరాత్ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వేధింపులకు గురి కాలేదన్నారు. తాను పదకొండు ఏళ్లుగా కేంద్రం నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పారు. కేంద్రం తనను ఎంతగా వేధించినప్పటికీ గుజరాత్ ప్రజలు ప్రేమతో ఎదుర్కొంటున్నానని చెప్పారు. మోడీ తనను తాను సెక్యూరిటీ గార్డుగా పేర్కొన్నారు.
తాను పదకొండేళ్లుగా రాష్ట్రాన్ని రక్షిస్తున్నానని, దీనిని ముందు ముందు కూడా కొనసాగిస్తానని చెప్పారు. కేవలం తన పాలన వల్లనే గుజరాత్లో అవినీతి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఈ పదకొండేళ్లలో గుజరాత్లో అవినీతి క్రమంగా తగ్గితే, కేంద్ర స్థాయిలో మాత్రం హెచ్చు మీరిందన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభివృద్ధి, ప్రాజెక్టుల విషయంలో తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు.
కాంగ్రెసు ప్రభుత్వంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ ప్రజలను చీటింగ్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండి ఆ పార్టీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాగా మన్మోహన్ సింగ్కు మోడీ సోమవారం కూడా తనతో పోటీ పడాలని సవాల్ విసిరారు.