ఆశా భోంస్లే కూతురు వర్షా భోంస్లే మృతి మిస్టరీయే

గాయని, కాలమిస్టు, ఫ్రీలాన్స్ జర్నలిస్టు అయిన 57 ఏళ్ల వర్షా భోంస్లే తన కుటుంబ సభ్యులంతా మరాఠీ అంతర్జాతీయ చిత్ర, థియేటర్ అవార్డుల ప్రదానోత్సవానికి సింగపూర్ వెళ్లిన సమయంలో వర్షా భోంస్లే ఆత్మహత్య చేసుకుంది. వర్షా భోంస్లే భౌతిక కాయానికి మంగళవారం అంత్యక్రియలు జరిగాయి.
తన కూతురు మరణవార్త తెలుసుకుని ఆశా భోంస్లే సోమవారం రాత్రి హుటాహుటిన ముంబై చేరుకున్నారు. వర్ష డిప్రెషన్తో బాధపడుతోంది. అందుకు ఆమె మానసికపరమైన చికిత్స కూడా పొందుతోంది. ఇది వరకే మూడు సార్లు ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.
వర్ష భోంస్లే ఆత్మహత్య చేసుకోవడానికి వాడిన పిస్టల్ ఎవరిదనేది పోలీసులకు అంతు చిక్కకుండా ఉంది. బెల్జియంలో తయారైన ఆ పిస్టల్ లైసైన్స్ ఎవరికి ఉందనేది తెలియడం లేదని, అది ఎవరి పేరు మీద రిజిష్టర్ అయి ఉందనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని దక్షిణ ముంబై అదనపు పోలీసు కమిషనర్ కృష్ణ ప్రకాష్ అంటున్నారు.
డిప్రెషన్తో బాధపడుతున్న వర్షను ఒంటరి వదిలి కుటుంబ సభ్యులంతా ఎందుకు వెళ్లారు, వర్ష ఆత్మహత్యకు వాడిన పిస్టల్ ఎవరిది, వర్ష ఒంటరిగా ఉన్న ఇంట్లో మారణాయుధం ఎందుకు ఉంచారు అనే ప్రశ్నలు ఆమె మృతిపై తలెత్తుతున్నాయి. పైగా, పోలీసులకు చేతికి ఏ విధమైన సూసైడ్ నోట్ కూడా దొరకలేదు.












Click it and Unblock the Notifications