అరెస్ట్ భయంతో అజ్ఞాతంలో శంకరన్న? కూతురువివరణ

శంకరరావు కోసం అల్వాల్ ఎసిపితో పాటు 15 మంది పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారని సమాచారం. అయితే, శంకర రావు అందుబాటులో లేరని తెలిసింది. ఆయన మహారాష్ట్రలోని శనిసింగారం ఆలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లినట్లు చెబుతున్నారు. శంకర రావును పోలీసు అధికారులు ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి ఉన్నాయి.
గ్రీన్ఫీల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు పి. శంకరరావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది.
ఈ కేసులో శంకర రావుపై జారీ అయిన అరెస్టు వారంట్పై ఉన్న స్టేను హైకోర్టు కొట్టేసింది. శంకర రావుతో పాటు ఆయన సోదరుడు దయానంద్ను కూడా పోలీసులు విచారిస్తారని అంటున్నారు. హైదరాబాదు సమీపంలోని ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని కనాజిగుడా గ్రామానికి చెందిన 875 ప్లాట్లను రెగ్యులరైజ్ చేసే విషయంలో గ్రీన్ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్కు చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసిందుకు ప్రయత్నించారని కాలనీవాసులు శంకర రావుపై ఫిర్యాదు చేశారు.
గ్రీన్ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ కాలనీవాసులు చేసిన ఫిర్యాదు మేరకు శంకర రావుపై మల్కాజిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. శంకర రావు శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని తెలుస్తోంది. ఆయన ఇంట్లో ప్రత్యేక బృందం సోదాలు కూడా నిర్వహించింది. బాత్రూమ్, స్టోర్ రూంలలో తనిఖీలు సాగాయి. అయితే ఆయనను ప్రశ్నించిన తర్వాతే అరెస్టుపై నిర్ణయం తీసుకోనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. శంకర రావు కనిపించక పోవడంపై కూతురు సుష్మిత... ప్రభుత్వ పని తీరు బాగుపడాలని దేవుడిని ప్రార్థించేందుకు వెళ్లినట్లు చెప్పారు.
మంత్రి రఘువీరాపై స్పందించిన లోకాయుక్త
రఘువీరా రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై లోకాయుక్త స్పందించింది. మంత్రితో పాటు పలువురు అధికారులు ఎదుర్కొంటున్న ఆరోపణలపై నివేదిక ఇవ్వాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. హైదరాబాద్ నగర పరిధిలోని శేరిలింగంపల్లి తహసీల్దారుగా పని చేసిన సుబ్బారావు విలువైన ప్రభుత్వం భూములను ప్రయివేటుకు ధారాదత్తం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఆయనను అక్కడి నుండి బదలీ చేసింది. ఆ తర్వాత ఆయనను సస్పెండ్ కూడా చేసింది. ఇదంతా జరగకముందే లోకాయుక్తలో ఓ స్వచ్చంద సంస్థ పిటిషన్ వేసింది.












Click it and Unblock the Notifications