తెలంగాణపై మంత్రుల బంతాట: తేల్చని బాబు, జగన్
తెలంగాణ అంశంతో కొన్ని రాజకీయా పార్టీలు లబ్ధి పొందుతుండగా, మరికొన్ని నష్టపోతున్నాయి. సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెసు ప్రధానంగా ఉన్న యూపిఏ మాత్రం ఎటూ తేల్చలేక పోతుంది. ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటున్నాయి. తెలంగాణ సమస్య పరిష్కారానికి సమయం పడుతుందంటారు, చర్చలు జరుగుతున్నాయంటారు, ఇప్పుడే తేల్చలేమంటారు, ఎంత కాలం చర్చలు కొనసాగుతాయో చెప్పలేమంటారు, ఈ సమస్య ఒక్కటే ఉందా అంటారు... ఇలా ఒక్కో కేంద్రమంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతారు.
కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ తెలంగాణ సమస్య పరిష్కారానికి సమయం పడుతుందని, ఆయా ప్రాంతాల నేతలతో చర్చించాల్సిన అవసరముందంటారు. ఏకాభిప్రాయం అవసరమంటారు. చర్చలు జరుగుతున్నాయి కానీ అవి ఎప్పటిలోగా పూర్తవుతాయో ఎప్పుడు సమస్య పరిష్కారమవుతుందో చెప్పలేమంటారు. ఇక వాయలార్ రవి తెలంగాణపై జోకులేస్తారు... ఆ తర్వాత లెంపలేసుకుంటారు.
ఏదో సరదాగా వ్యాఖ్యానించానని చేతులు దులుపుకుంటారు. దేశంలో తెలంగాణ సమస్య ఒక్కటే లేదంటారు. త్వరలో తెలంగాణపై నిర్ణయం ఉంటుందని చెబుతున్న నేతలే ఇప్పట్లో తేల్చేలేమంటారు. చర్చలు సాగుతున్నాయని, త్వరలో పూర్తవుతాయని చెబుతూనే ఎప్పుడు అవి కంప్లీట్ అవుతాయో చెప్పలేమంటారు. తెలంగాణ అంశాన్ని పరిష్కరించేందుకు నిర్ధిష్ట కాలపరిమితి ఎందుకు లేదో ఎవరూ చెప్పరు. ప్రతి దానికి ఓ కాలపరిమితి అంటూ ఉంటుంది.
కానీ తెలంగాణపై కాలపరిమితి చెప్పేందుకు మాత్రం కాంగ్రెసు కానీ, యూపిఏ ప్రభుత్వం గానీ సాహసం చేయదు. ఎన్నో అంశాలపై సొంత అభిప్రాయంతో ముందుకు వెళ్లిన కేంద్రం తెలంగాణ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం అంటూ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తోంది. తెలంగాణపై ఎలాంటి ప్రకటన చేసినా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉండటంతో కాంగ్రెసు ఎటూ తేల్చలేక పోతుంది. అయితే కాంగ్రెసు తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ పేరుతో ఇరు ప్రాంతాల నేతలతో బంతాట ఆడుకుంటుందనే మాట మాత్రం నిజం.
ఇక రాష్ట్రం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాము గతంలోనే తెలంగాణపై తేల్చామని, మరోసారి చెప్పాల్సిన అవసరం లేదంటారు. అయితే తెలంగాణకు అనుకూలంగా అప్పటి కేంద్ర హోంమంత్రికి లేఖ ఇచ్చి ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వచ్చాక అర్ధరాత్రి ప్రకటన అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. తెలంగాణపై తమ స్టాండ్ ఏమిటో మాత్రం చెప్పరని అంటున్నారు. కానీ అప్పుడు లేఖ ఇచ్చామని, మరోసారి ఇవ్వాల్సిన అవసరం లేదంటరు.
సమైక్యాంధ్రకు టిడిపి కట్టుబడి ఉందని సీమాంధ్ర నేతలు అంటారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ నేతలు అంటారు. దీనిపై మాత్రం చంద్రబాబు పెదవి విప్పరు! బాబు లేఖ ఇవ్వడం, అర్ధరాత్రి ప్రకటన అని మండిపడటం, ఇరు ప్రాంతాల నేతలు చెరో విధంగా మాట్లాడటాన్ని చూస్తే అసలు ఆ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందా అర్థం కాని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. గతం గతః ఇప్పుడు తెలంగాణపై తేల్చండి అంటే టిడిపి మాత్రం గతాన్ని తవ్వుతుందని విమర్శిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తెలంగాణపై తమ పార్టీ పరంగా ఏదో ఒక నిర్ణయాన్ని చెప్పేందుకు వెనుకంజ వేస్తోంది. తాము ఇచ్చే పరిస్థితిల్లో లేము తెచ్చే పరిస్థితుల్లో లేమని చెబుతూ తప్పించుకోజూస్తుంది. రాష్ట్రంలో కొత్తగా పుట్టి ఎదుగుతున్న ఈ పార్టీ తెలంగాణపై సరైన ప్రకటన చేయక పోవడం సరికాదంటున్నారు. తెరాస కూడా తెలంగాణ ఇస్తే విలీనం చేస్తామని, విలీనం చేయమని ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడటం సరికాదంటున్నారు.