భారతీయ సంస్కృతిలో జీవ వైవిధ్యం: సదస్సులో ప్రధాని
జీవ వైవిధ్య పరిరక్షణకు అందరూ కృషి చేయాలని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఇందు కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఉద్యమించాలన్నారు. జీవ వైవిధ్యంపై పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2010 లక్ష్యాలను చేరుకోలేక పోయామన్నారు. ప్రకృతి నుండి కనుమరుగు అవుతున్న జంతువులను పరిరక్షించాల్సిన బాధ్యత మనపైన ఉందన్నారు.
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పర్యావరణమే ముఖ్యమన్నారు. ఆయుర్వేద విజ్ఞానాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు వాడుతున్న విత్తనాల పేటెంట్ హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. భారత దేశంలో 600 పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలు ఉన్నాయని, వాటిని పదికాలాల పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పశు సంపద కూడా మనకు ముఖ్యమే అన్నారు.
105 పేటెంట్ హక్కులపై భారతదేశం విజయం సాధించిందన్నారు. భారత సాంప్రదాయ వ్యవసాయంలో పర్యావరణ పరిరక్షణ ఉందన్నారు. పులి, ఏనుగు వంటి అంతరించుపోతున్న జాతుల సంరక్షణ కోసం చర్యలు తీసుకున్నామని చెప్పారు. వన్యప్రాణుల రక్షణ కోసం చట్టాలని కఠినతరం చేశామని చెప్పారు. సాంప్రదాయ పంటలను కాపాడుకోవాలన్నారు. ఆహార భద్రత ప్రపంచానికి పెను సవాల్గా మారిందన్నారు.