హేమశ్రీ తల్లిని ప్రశ్నిస్తున్న పోలీస్లు: మోతాదు మించి..
సూరేంద్ర పోలీసు కస్టడీకి ఈ నెల 19తో ముగుస్తుందని, ఆ తర్వాత జ్యూడిషియల్ కస్టడీకి వెళ్తాడని చెప్పారు. మరోవైపు హేమశ్రీ మృతి కేసులో ఆమె భర్త సురేంద్రకు కారు డ్రైవర్ సతీష్ సహకరించినట్లుగా భావిస్తున్నారు. అతను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడని సమాచారం. సతీష్ పరారీలో ఉన్నాడు. హేమశ్రీ కేసులో ఇప్పటికే చాలా విషయాలు తెలిశాయని, సతీష్ను విచారిస్తే పూర్తవుతుందని పోలీసులు చెబుతున్నారు.
కాగా హేమశ్రీ అనుకోకుండా మృతి చెందిందని సురేంద్ర విచారణలో చెబుతున్నారని సమాచారం. హేమశ్రీకి మోతాదుకు మించి మత్తు మందు ఇవ్వడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందని చెప్పినట్లుగా సమాచారం. హేమశ్రీ మృతికి ముందు తన భర్త, అత్త, మామల పైన పోలీసు స్టేషన్లో కేసు పెట్టింది. సురేంద్ర తనను మోసం చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో హేమశ్రీ తల్లిని కూడా పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లుగా సమాచారం.
కర్నాటక రాష్ట్రానికి చెందిన ప్రముఖ టివి నటి హేమశ్రీ మృతి కేసులో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని అనంతపురం జిల్లాలో ఐజి గోవింద్ సింగ్ మంగళవారం చెప్పిన విషయం తెలిసిందే. రాయలసీమలో ఫ్యాక్షన్ అదుపులోనే ఉందని చెప్పారు. హేమశ్రీ కేసును బెంగళూరు పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారని గోవింద్ సింగ్ చెప్పారు. వారి విచారణకు తాము అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు. రాజకీయ ఒత్తిళ్లు అవాస్తవమని చెప్పారు.