విశాఖపట్నం సమీపంలో రోడ్డు ప్రమాదం- నలుగురు దుర్మరణం: టీడీపీ ఎమ్మెల్యే పీఏగా గుర్తింపు?
విశాఖపట్నం-విజయనగరం సరిహద్దుల్లో ఈ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆనందపురం జాతీయ రహదారిపై గండిగుండం జంక్షన్ వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
బాధితులను తెలుగుదేశం పార్టీకి చెందిన వినుకొండ శాసన సభ్యుడు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వ్యక్తిగత కార్యదర్శి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులుగా గుర్తించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ కు గాయాలయ్యాయి. శనివారం రాత్రి చంద్రశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు కారులో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి బయలుదేరారు. మార్గమధ్యలో ఈ తెల్లవారు జామున ఆనందపురం జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. గండిగుండం జంక్షన్ వద్ద ఓ లారీని వెనుక వైపు నుంచి బలంగా ఢీ కొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. చంద్రశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆనందపురం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఆనందపురం సీఐ ఎర్రం నాయుడు తన సిబ్బందితో కలిసి అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జాతీయ రహదారిపై జరిగిన ఈ భారీ ప్రమాదం కారణంగా ఆనందపురం హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. దాదాపు గంటన్నర శ్రమించిన అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇటీవలి కాలంలో జాతీయ రహదారులపై జరుగుతున్న వరుస ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో, తెల్లవారుజామున అతివేగం, నిద్రమత్తు కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. జంక్షన్ల వద్ద కనీస హెచ్చరిక బోర్డులు లేకపోవడం, లైటింగ్ సరిగ్గా లేకపోవడం కూడా కొన్నిసార్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు కనీస నియమాలను పాటించాలని పోలీసులు సూచిస్తోన్నారు.












Click it and Unblock the Notifications