ఏపీలో 913 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీ- అర్హత, జీతం ఇలా..! జిల్లాల వారీగా ఖాళీలివే..!
ఏపీలో వైద్య సేవల్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో 913 ఆశా వర్కర్ల పోస్టుల్ని (ASHA Worker Posts) భర్తీ చేయాలని ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. వీటి భర్తీతో రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ చేసినట్లవుతుందన్నారు. జీరో వేకెన్సీ విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో ప్రభుత్వం 1294 ఆశా వర్కర్ల పోస్టుల్ని భర్తీ చేసిందన్నారు.
ప్రస్తుతం భర్తీ చేస్తున్న 913 ఆశా వర్కర్ల పోస్టుల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళల్లో పదో తరగతి కనీస అర్హత కలిగి, 25-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. నిబంధనలను అనుసరించి ఈ నెల 30వ తేదీ నాటికి నియామకాల జాబితాను పంపించాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు.

అనకాపల్లిలో 77, కర్నూలులో 65, తూర్పుగోదావరిలో 44, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, పార్వతీపురం మన్యంలో 43, పశ్చిమగోదావరిలో 42, అన్నమయ్యలో 41, ప్రకాశంలో 38, వైఎస్సార్ కడపలో 38, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 33, చిత్తూరులో 32, కోనసీమలో 32, పల్నాడులో 31, విజయనగరంలో 31, కాకినాడలో 29, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 29, ఏలూరులో 27, అనంతపురంలో 26, మార్కాపురంలో 25, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, శ్రీకాకుళంలో 22, గుంటూరులో 21, నంద్యాలలో 21, పోలవరంలో 21, తిరుపతిలో 21, ఎన్టీఆర్ జిల్లాలో 15, బాపట్లలో 7 చొప్పున ఈ ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన ఒక్కో ఆశా కార్యకర్తకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం లభిస్తుంది. ఇందులో రూ.8,320 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.














Click it and Unblock the Notifications
