చిత్తు కాగితం: బాబు లేఖపై హరీష్, షర్మిలను ప్రశ్నిస్తాం
కిరాయి మనుషులతో, గూండాలతో చంద్రబాబు తన పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారన్నారు. తెలంగాణపై బాబు వైఖరిని తేల్చుకునే హక్కు తమ ప్రాంత ప్రజలకు ఉందన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలకి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబుకు తెలంగాణలో పర్యటిస్తే నిలదీతలు తప్పవన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి రెండూ సమైక్యవాద పార్టీలో అని ఆరోపించారు.
చంద్రబాబు ఇచ్చానని చెబుతున్న లేఖ చిత్తు కాగితంతో సమానమన్నారు. తెలంగాణ ప్రాంత టిడిపి నేతలకు తెలంగాణ రావాలని లేదన్నారు. అందుకే వారు చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణ తెస్తామని చెబుతున్నారన్నారు. బాబు అధికారంలోకి వస్తే మోత్కుపల్లి, ఎర్రబెల్లి లాంటి వారు తమకు పదవులు వస్తాయని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతనే కాలుమోపాలన్నారు.
ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులది రాజకీయ యాత్ర మాత్రమే అన్నారు. దసరా తర్వాత కాంగ్రెసు లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. టి-మంత్రుల ఢిల్లీ పర్యటనతో వారి మధ్య అనైక్యత బయటపడిందన్నారు. ఇక ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు, చర్చలకు ఫుల్ స్టాప్ పెడతామన్నారు.