తెలంగాణకి బాబు: టిడిపి వర్సెస్ జెఏసి, ఆఫీస్కి నిప్పు
దీంతో తెలంగాణ జెఏసి ఆయన పర్యటన అడ్డుకునేందుకు చలో రాజోలికి పిలుపునిచ్చింది. బాబుకు తెలంగాణ నిరసన తెలియజేసేందుకు భారీగా తెలంగాణవాదులు తరలి వెళుతున్నారు. ఇప్పటికే తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ హెచ్చరించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిన తర్వాతనే బాబు తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తాము నిరసన తెలియజేస్తామని, అడ్డుకుంటామని హెచ్చరించారు.
తెరాసలాంటి తెలంగాణ పార్టీలు నేరుగానే తలపడేందుకు సిద్ధపడ్డాయి. పసుపు జెండాల పాదయాత్రను నల్లజెండాలతో చుట్టుముట్టాలని, నల్ల బ్యాడ్జీలతో తిరగాలని కోదండరామ్ సూచించారు. తెలంగాణపై వైఖరి చెప్పకుండా అడుగు పెట్టనీయమని, ప్రాంతం బయట దాకా జనం తరిమికొడతారని తెరాస నేతలు హెచ్చరించారు. అయితే దీనిపై టిడిపి కూడా దీటుగా స్పందించింది.
అధినేత పాదయాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తన శక్తులన్నింటినీ పాదయాత్ర వెంట మోహరించేందుకు సిద్ధమవుతోంది. పాదయాత్రను అడ్డుకోవద్దని కోదండరామ్ తదితరులకు ఒకవైపు హితవు పలుకుతూనే.. అవసరమైతే దేనికైనా సిద్ధమనే సంకేతాలను ఇప్పటికే ఆ పార్టీ తెలంగాణ నేతలు పంపించారు. పాదయాత్ర జోలికొస్తే గతంలో తమ అధినేత రైతుపోరుబాటను అడ్డుకొన్నప్పటి చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని టిఆర్ఎస్, జెఏసిలను హెచ్చరించారు.
చంద్రబాబును దమ్ముంటే అడ్డుకోవాలని తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరాంను టిడిపి నేతలు హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తూ కోదండరాం పబ్బం గడుపుకుంటున్నారని ఆ పార్టీ గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు విమర్శించారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెస్ను వదిలేసి టిడిపిని లక్ష్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. బాబు తెలంగాణలో కాలుమోపే ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.
కరీంనగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పార్టీ దీనిని ఖండించింది. టిడిపిని తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. నిప్పు పెట్టిన ప్రాంతంలో తెలంగాణ జెఏసి పేరుతో ఓ లేఖ ఉంది. తెలంగాణపై స్పష్టత ఇచ్చాకే ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.