తెలంగాణలో చంద్రబాబు యాత్రకు జగన్ పార్టీ వకాల్తా

చంద్రబాబును ఓ వైపు విమర్శిస్తూనే తెలంగాణలో చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవడం సరి కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. చంద్రబాబును తెలంగాణవాదులు అడ్డుకోవాలని అనుకోవడం సరి కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం నెల్లూరులో మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా పాదయాత్రలు చేయవచ్చునని అన్నారు.
తెలంగాణ సమస్య ఢిల్లీలో తేల్చాల్సిన అంశమని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబు తప్పు చేశారని అన్నారు. చంద్రబాబు తొమ్మిది సూత్రాల ప్రణాళికను తెలుగుదేశం కార్యకర్తలే నమ్మడం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో విశ్వసనీయత లని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. అధికారం కోసం ఆఖరి యాత్రగా చంద్రబాబు పాదయాత్రను ఎంచుకున్నారని ఆయన అన్నారు.
కాగా, షర్మిల పాదయాత్ర త్వరలో తెలంగాణలో ప్రవేశించనుంది. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించిన తర్వాత చంద్రబాబు, షర్మిల తెలంగాణలో పర్యటించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు పాదయాత్రనే కాకుండా షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకుంటామని వారు చెప్పారు. దీంతో షర్మిల పాదయాత్రకు అడ్డంకులు తొలగాలంటే చంద్రబాబు పాదయాత్ర తెలంగాణలో సజావుగా జరగాల్సి ఉంటుందని వైయస్సార్ కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పాదయాత్రను తెలంగాణవాదులు అడ్డుకోవద్దని మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications