సామాజిక తెలంగాణ అన్న పార్టీ ఏమైంది: చిరుపై బాబు

తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని, ఈ విషయంపై తాము ఎవరితోనైనా చర్చకు సిద్ధమని అన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావేనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణపై వెంటనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతకు ముందు, తెలంగాణలో చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవడానికి కోదండరామ్, స్వామిగౌడ్, శ్రీనివాస గౌడ్ తెలంగాణ జెఎసి నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి కొత్తకోట పోలీసు స్టేషన్కు తరలించి, ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. తెలంగాణకు కేంద్రమే పరిష్కారం చూపాలని ఆయన అన్నారు.
కాంగ్రెసులో కలుస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు చెబుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రమే తన కుటుంబమని, ప్రజలే తన కుటుంబ సభ్యులని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సామాజిక న్యాయానికి తాను కట్టుబడి ఉన్నానని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు అండగా ఉంటానని చెప్పారు. ఆర్డిఎస్ ద్వారా ఎట్టి పరిస్థితిలోనూ నీరు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
వరద బాధితులకు మూడేళ్లయినా ప్రభుత్వం ఇళ్లు కట్టించకపోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. కృష్ణా నది వరదల్లో సర్వస్వం కోల్పోయిన రాజోలీవాసులకు ప్రభుత్వం ఏ సాయం చేసిందని అడిగారు. విద్యుత్ కోతతో రైతులు తీవ్ర కష్టాల పాలయ్యారని అన్నారు. రాజోలీ చేనేతకు ప్రతీక అని, చెనేత కార్మికులను ఆదుకుంటామని చంద్రబాబు అన్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణమాఫీ, మలి సంతకం మద్యం గొలుసు దుకాణాల రద్దు ఫైళ్ల మీదనే అని చెప్పారు. సిబ్సిడీపై 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు తనకు ప్రాణంతో సమానమని చెప్పారు.












Click it and Unblock the Notifications