బాబుతో ఎన్టీఆర్ ప్యాచప్, గద్వాల యాత్ర సీక్రెట్?
చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు వెలువడిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీలో తన వర్గాన్ని చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉసిగొలుపుతున్నారనే విమర్శలను కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కున్నారు. శాసనసభ్యుడు కొడాలి నాని రాజీనామాతో ఆ విమర్శలు పతాకస్థాయికి చేరుకున్నాయి. కొడాలి నానితో తనకు ఏ విధమైన సంబంధం లేదని అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కానీ చంద్రబాబుతో మాత్రం జూనియర్ ఎన్టీఆర్కు సత్సంబంధాలు ఏర్పడలేదు.
ప్రమాదం జరిగినా పలకరించలేదనే అపవాదు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబును కలిశారా, సయోధ్య కోసం కలిశారా అనేది తేలడం లేదు. నిర్మాత బండ్ల గణేష్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును కలవడానికి వచ్చారు. చంద్రబాబుకు దూరం కావడం వల్ల జూనియర్ ఎన్టీఆర్కు తెలుగుదేశం కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు దూరమయ్యారు. కొడాలి నాని రాజీనామా తర్వాత ఆ విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది. దాంతో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరం కావడానికి సిద్ధంగా లేరని అంటున్నారు.
సినిమాలపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబుతో, బాబాయ్ బాలకృష్ణతో ఆయన సయోధ్య కుదుర్చుకోవడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ చంద్రబాబు పాదయాత్రకు పూర్తి మద్దతు ప్రకటించారు. పాదయాత్ర ప్రారంభ ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ బాద్షా చిత్రంలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను ఆయన ఒప్పుకున్నారు.
కాగా, చంద్రబాబును పరామర్శించడానికి పెద్ద యెత్తున అభిమానులు గద్వాలకు వచ్చారు. వారికి చంద్రబాబు తనయుడు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నాన్నగారు విశ్రాంతి తీసుకుంటున్నారని, పాదయాత్రలో చంద్రబాబును కలవాలని ఆయన వారికి సూచించారు. వైద్యుల సూచనల మేరకు చంద్రబాబు బయటకు వస్తారని ఆయన చెప్పారు. చంద్రబాబును బాలకృష్ణ సతీమణి వసుంధర తదితరులు పరామర్శించారు.