బాబు వెన్నుకు స్వల్ప గాయం: ఒక రోజు విరామం

చంద్రబాబుకు ఫ్యాక్చర్ ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డి చెప్పారు. వైద్యుల సూచన మేరకు శనివారం పాదయాత్రకు విరామం ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు శనివారంనాటి పాదయాత్ర వాయిదా పడింది. హైదరాబాద్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టుభవన్ నుంచి గద్వాలకు వైద్యుల బృందం బయలుదేరింది.
చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రావుల చంద్రశేఖర రెడ్డి పార్టీ కార్యకర్తలకు చెప్పారు. మూడు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చంద్రబాబుకు సూచిస్తున్నారని, అయితే పాదయాత్రను ఆపడానికి చంద్రబాబు ఇష్టపడడం లేదని ఆయన చెప్పారు. వస్తున్నా... మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడికి శుక్రవారం రాత్రి ప్రమాదం తప్పింది. మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో ఏర్పాటు చేసిన సభావేదిక ఒక్కసారిగా కూలిపోయింది. అయితే చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని తెలుగుదేశం నాయకులు చెప్పారు.
గద్వాలలో సభా వేదిక నుంచి ప్రసంగం అనంతరం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు వద్దకు తోసుకుని పోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా సభా వేదిక కూలింది. ఘటన అనంతరం చంద్రబాబు నడుచుకుంటూ వెళ్లారు. చంద్రబాబు ఆ తర్వాత అర కిలోమీటరు నడిచారు. షెడ్యూల్ ప్రకారం రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ గద్వాలకు బయలుదేరి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా శనివారం చంద్రబాబును పరామర్శించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications