కావూరికి అహ్మద్ పటేల్ బుజ్జగింపులు: సర్వేకూ చోటు
తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, పార్టీ పదవి అక్కరలేదని కావూరి అహ్మద్ పటేల్తో తెగేసి చెప్పినట్లు సమాచారం. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కూడా కావూరి సాంబశివ రావుతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కావూరికి ఫోన్ చేసి రాజీనామా చేయవద్దని సూచించారు. కానీ కావూరి సాంబశివరావు వినడం లేదని తెలుస్తోంది.
కాగా, రాజీనామా చేయాలని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుపై ఒత్తిడి పెరుగుతోంది. సీనియారిటీకి ప్రాధాన్యం లభించడం లేదని, పైరవీలే పనిచేస్తున్నాయని రాయపాటి సాంబశివ రావు తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై వ్యాఖ్యానించారు. శనివారం సాయంత్రం తన కార్యకర్తలతో సమావేశమై ఏం చేయాలనే విషయంపై రాయపాటి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణకు కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. దీంతో మంత్రివర్గంలోకి మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురిని కొత్తగా తీసుకుంటున్నారు. సర్వే సత్యనారాయణకు సహాయ మంత్రి హోదా ఇచ్చి సామాజిక న్యాయశాఖను కేటాయించే అవకాశం ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి రైల్వే శాఖ సహాయ మంత్రి పదవి దక్కనుంది.
కిల్లి కృపారాణికి ఆరోగ్య శాఖ సహాయ మంత్రి పదవి దక్కనుంది. చిరంజీవికి పర్యాటక శాఖను అప్పగించి స్వతంత్ర హోదా ఇస్తారని అంటున్నారు. బలరాం నాయక్కు గిరిజన శాఖ సహాయ మంత్రిపదవి ఇస్తున్నారు. తనకు ప్రమోషన్ దక్కుతుండడంపై దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతోనే తనకు ప్రమోషన్ ఇస్తున్నారని, సోనియా గాంధీ చలువ వల్లనే తనకు ఈ స్థానం లభిస్తోందని అన్నారు.