జైపాల్ రెడ్డి సెల్ఫ్గోల్: సోనియా ఆగ్రహంతో డిమోషన్?
సొంతపార్టీ ఎంపీల తెలంగాణ హడావుడి వెనుక జైపాల్ రెడ్డి ఉన్నారని సోనియా గాంధీ భావించడం వల్లనే ఆయనకి డిమోషన్ కలిగిందని అంటున్నారు. ఇటీవల తెలంగాణ ఉద్యమంలో ఎంపీలు పలువురు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వారు అధిష్టానికి సైతం అల్టిమేటం జారీ చేసిన సందర్భాలు ఉన్నాయి.
వీటన్నింటి వెనుక జైపాల్ రెడ్డియే ఉన్నారని అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. జైపాల్ రెడ్డి పట్ల సోనియా గాంధీ మొదటి నుండి అభిమానంతో ఉండేవారు. అనుభవజ్ఞుడైన రాజకీయవేత్తతో పాటు ఆచితూచి మాట్లాడటం, చిల్లర రాజకీయాలు చేయక పోవడం తదితరాలు సోనియాకు ఆయన పట్ల అభిమానం పెరగడానికి కారణాలు.
కానీ తెలంగాణ ఎంపీలు రెచ్చిపోవడం వెనుక ఆయన ఉన్నారని సోనియా భావిస్తున్నారట. ఎంపీలను రెచ్చగొట్టడమే కాకుండా ఆయన మాత్రం అధిష్టానానికి అండగా ఉంటున్నట్లుగా సైలెంట్గా ఉండటాన్ని అధినేత్రి గమనించిందని, అందుకే అతనికి డిమోషన్ జరిగిందని అంటున్నారు.