పులివెందులలో బాబు పేరు హాస్యాస్పదం: షర్మిలపై గాలి
జగన్ సిఎం అయితే రామరాజ్యం అని షర్మిల చెబుతున్నారని కానీ రావణ రాజ్యమే అవుతుందన్నారు. పులివెందుల ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటే వాటికి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముప్పై ఐదేళ్లుగా పులివెందులను పాలిస్తున్న వారు బాబు పేరు చెప్పడమేమిటన్నారు. షర్మిల ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన నిలదీశారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో ఇలాగే పాదయాత్ర చేసి రాష్ట్ర సంపదను కొడుక్కు దోచి పెట్టారని, ఇప్పుడు షర్మిల మిగిలిన దాని కోసం పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ జైలులో ఎందుకు ఉన్నాడో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు షర్మిలకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెసు పార్టీని సమస్యల పైన నిలదీయాలని, జగన్ను ములాకత్లో ఎవరెవరు కలుస్తున్నారో, ఆయన ఎవరెవరికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారో తాము ఆర్టీఐ కింద దరఖాస్తు చేసినట్లు చెప్పారు.
వైయస్ జగన్ వేలకోట్ల రూపాయలు దండుకుని జైలు ఊచలు లెక్కిస్తుంటే అన్నకు సంఘీభావంగా షర్మిల పాదయాత్ర చేస్తున్నారని టిడిపి నేత వర్ల రామయ్య కృష్ణా జిల్లాలో అన్నారు. సిబిఐ, కోర్టులు జగన్ను అవినీతిపరుడు అనిపేర్కొన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు నేతలు జగన్ను కాపాడే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. తొమ్మిది ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు.
కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలిపి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మరోవైపు కేంద్రమంత్రులుగా కొత్తగా ప్రమాణస్వీకారం చేసే మంత్రులైనా పాతవారిలా ఉత్సవ విగ్రహాల్లా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడాలని శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి గుంటూరు జిల్లాలో విజ్ఞప్తి చేశారు.