కిరణ్ ఇంపార్టెన్స్: నాని నుండి రాజేశ్ వరకూ జగన్కు జై
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జంప్ జిలానీలకే ప్రాధాన్యం ఇస్తున్నారా అంటే అవుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కిరణ్ ముఖ్యమంత్రి ఐన తర్వాత ఆయన ఎవరికెవరికైతే ప్రాధాన్యం ఇచ్చారో వారిలో పలువురు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. ఇది ఇప్పుడు కాంగ్రెసు పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీని వదిలి వెళతారని తెలిసిన వారిని కిరణ్ మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కానీ అవి ఫలించడం లేదంటున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జంప్ జిలానీలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు, మద్దాల రాజేశ్ తదితర ఎమ్మెల్యేలు జగన్ వైపు వెళ్తారని తెలిసి వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ కిరణ్ ప్రయత్నాలు ఫలించలేదు. అదే పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే వారి పట్ల మాత్రం ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో ప్రధానంగా ఉన్న వారికే గాలం వేస్తూ వస్తున్నారు. పలువురికి ఆయన గాలం వేస్తున్నప్పటికీ కిరణ్ ప్రాధాన్యత ఇచ్చే వారు కూడా ఆయన వైపు రావడం కాంగ్రెసు వర్గాల్లో చర్చకు తెరలేచింది.

చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయనకు కిరణ్ మంచి ప్రాధాన్యం ఇచ్చారు.

ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అడిగిందే తడవుగా ముఖ్యమంత్రి ఒకే చెప్పేవారు. ఆయనను బుజ్జగించేందుకు కిరణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాని తాను అనుకున్నట్టుగానే కిరణ్ ఎంతగా పనులు చేసినా ఆఖరుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపుకు వెళ్లారు.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి వంటి తదితర ప్రజాప్రతినిధులు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసినప్పటికీ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినవస్తున్నాయి.
మరోవైపు పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసే వారిని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా పార్టీలో అసంతృప్తి సెగలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. పార్టీ వదిలి వెళ్లిపోయే వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలో ఆగ్రహం పెల్లుబుకుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్.. ఇలా పలువురు కిరణ్ ప్రాధాన్యత ఇచ్చిన వారే జగన్ వైపు వెళ్తున్నారని గుర్తు చేస్తున్నారు.
నాని పార్టీని వీడుతారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. ఈ సమయంలో నానిని బుజ్జగించే యత్నాలను కిరణ్ చేపట్టారు. ఏలూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై మున్సిపాలిటీలో రూ.17 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నాని కాంగ్రెస్కు గుడ్బై చెప్పారు. సుజయ కృష్ణ రంగారావు విషయంలోనూ అదే జరిగిందని అంటున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే రాజేశ్ కూడా కిరణ్కు షాక్ ఇచ్చారు.
కిరణ్ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజేశ్ అత్యంత సన్నిహితునిగా మెలిగారు. రాజేశ్ కోరిందే తడవుగా అనేక పనులకు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారంటూ పలువురు శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. రాజేశ్ మామ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆయనను కోరిన చోటికి రాజేశ్ బదిలీ చేయించుకున్నారట. అలాంటి రాజేశ్ కూడా ఇప్పుడు జగన్ పార్టీలో చేరారు. పార్టీకి విధేయులుగా ఉన్న వారిని పట్టించుకోకుండా పార్టీని వీడతారన్న వారికి సిఎం ప్రాధాన్యత ఇవ్వడాన్ని పలువురు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారట.
స్వర్గీయ పి జనార్ధన్ రెడ్డి(పిజెఆర్) తనయుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అంశం పార్టీలో ప్రధానంగా చర్చకు వస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తర్వాత పార్టీలోని చాలామంది ప్రజాప్రతినిధులు జగన్కు జై కొడుతూ ఆయన్ను ముఖ్యమంత్రిని చేయాలంటూ అధిష్ఠానాన్ని కోరుతూ పోటీలు పడి సంతకాలు చేశారు. దీంతో అప్పుడే విష్ణు తీవ్రస్థాయిలో విభేదించారు. ఎందరు ఒత్తిడి చేసినా లొంగకుండా, అధిష్ఠానం నిర్ణయమే తన నిర్ణయమంటూ స్పష్టం చేశారు.
అంతేకాదు కిరణ్ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంత చేసినా విష్ణుకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం లభించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న విష్ణు రాజకీయంగా ఒడిదొడుకులకు గురైన సమయంలో ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి భరోసా రాకపోవడాన్ని పార్టీ నేతలు ప్రస్తావిస్తున్నారు. కిరణ్ కారణంగా విష్ణువర్ధన్ లాంటి నేతలు పార్టీలో అసంతృప్తికి గురవుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications