తెరాసలోకి నాగం క్యాంప్ ఎమ్మెల్యేలు? ఇంటికి కెసిఆర్!
నాగం టిడిపికి గుడ్ బై చెప్పిన తర్వాత పార్టీ, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో తిరిగి గెలుపొందారు. నాగంతో పాటు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాల చారిలపై టిడిపి వేటు వేసింది. వారు నాగం జనార్ధన్ రెడ్డి వెంటే ఉంటూ తెలంగాణ ఉద్యమాల్లో పలుమార్లు పాల్గొన్నారు. అయితే వారు ఓ వేదిక కోసం ఎదురు చూస్తున్నారు.
అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలక రోల్ పోషిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరేందుకు హరీశ్వర్ రెడ్డి ఆసక్తి కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రోజు కలవనున్నారని తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి సుముఖంగా ఉన్నందున పార్టీలోకి ఆహ్వానించేందుకే వస్తున్నారని తెలుస్తోంది.
హరీశ్వర్ రెడ్డితో పాటు వేణుగోపాల చారిని కూడా కెసిఆర్ ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి నిన్న కెసిఆర్ను కలిశారు. హరీశ్వర్ ఆహ్వానం మేరకు కెసిఆర్ ఈ రోజు లంచ్కి వెళ్తున్నారు. హరీశ్వర్, వేణుగోపాల చారిలు సస్పెన్షన్కు గురయ్యారు. వీరితో పాటు నాగం వెంట బయటకు వచ్చిన జోగు రామన్న కూడా తెరాసలోకి రానున్నారని తెలుస్తోంది.