జగన్ వ్యూహం: తెలంగాణలో కెసిఆర్కు కౌంటర్ వీరే
హైదరాబాద్: తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షు కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పకడ్బందీ వ్యూహాన్నే అనుసరిస్తున్నట్లున్నారు. యువ తెలంగాణ కన్వీనర్ జిట్టా బాలకృష్ణా రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంతో ఈ వ్యూహం మరింత పదునెక్కింది. తెరాస పాత కాపుల ద్వారా తన బలాన్ని పెంచుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నట్లున్నారు. తన సోదరి షర్మిల పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించే లోగా మరింత బలాన్ని సంతరించుకునే ఆలోచనలో ఉన్నట్లున్నారు.
నల్లగొండ జిల్లా భువనగిరిలో తెలంగాణవాదం బలంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు కారణంగా తెరాస భువనగిరి శానససభా నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి పోటీ చేశారు. తనకు తెరాస టికెట్ రాకపోవడంతో తిరుగుబాటు చేసి జిట్లా బాలకృష్ణా రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన రెండో స్థానం నిలిచారు.
కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కూడా తెలంగాణవాదం బలంగా ఉంది. ఈ శాసనసభా నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కెసిఆర్ తనయుడు కెటి రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సీటును తనకు కేటాయిస్తారని భావించిన కెకె మహేందర్ రెడ్డికి నిరాశే మిగిలింది. దీంతో ఆయన తిరుగుబాటు చేసి స్వతంత్ర అభ్యర్థిగా కెటి రామారావుపై పోటీ చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేశారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున రంగంలోకి దిగబోతున్నారు.
ఇక, వరంగల్ జిల్లాలోని జనగామ గురించి చెప్పనే అక్కరలేదు. అనివార్య కారణాల వల్ల తెరాస నుంచి పోటీ చేసిన కొమ్మూరి ప్రతాపరెడ్డి అతి స్పల్ప ఓట్ల తేడాతో ప్రస్తుత మంత్రి పొన్నాల లక్ష్మయ్య చేతిలో ఓడిపోయారు. కొమ్మూరి ప్రతాపరెడ్డి కూడా ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసును, తెరాసను ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపడుతున్నారు.
నల్లగొండ జిల్లాలోని ఆలేరు శాసనసభా నియోజకవర్గంలో కూడా తెరాస బలంగా ఉంటుంది. అయితే, అప్పుడు కాంగ్రెసులో ఉన్న ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కారణంగా, టికెట్ ఇవ్వడంలో చేసిన తప్పిదం వల్ల తెరాస ఆ సీట్లో ఓడిపోయింది. లేదంటే, అది తెరాస గెలవాల్సిన సీటు. ఇప్పుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి తెరాసలో చేరడంతో వైయస్సార్ కాంగ్రెసుకు ఆ సీటులో బలం పెరిగినట్లే.
తెరాస బలంగా ఉన్న శానససభా నియోజకవర్గాలపై వైయస్ జగన్ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే పలువురు తెరాస పాత నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తెలంగాణవాదం ఒంటి నిండా నింపుకున్న నేతలు కూడా కెసిఆర్ వైఖరితో విసిగిపోయి, వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూడా ఇదే సమయంలో ఆయన గుర్తిస్తున్నట్లు అర్థమవుతోంది. వరంగల్ జిల్లా పరకాలలో కొండా సురేఖ పోటీకి సిద్ధంగా ఉన్నారు.